ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ
అలంపూర్: పార్లమెంట్లో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధుల సమష్టి భాగస్వామ్యంతో ముందుకెళ్లాల్సి ఉండగా.. బీజేపీ ప్రభుత్వం ఏకపాత్రాభినయం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. అలంపూర్ చౌరస్తాలోని విశ్వశాంతి డిగ్రీ కళాశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన సీపీఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. అఖిలపక్ష పార్టీలతో చర్చించకుండానే పార్లమెంట్లో ఏకపక్షంగా ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి.. వీబీజీ రామ్జీ బిల్లు ఆమోదం చేసుకున్నారన్నారు. విద్యుత్ సవరణ బిల్లు అమలులోకి వస్తే అట్టడుగు పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలు దూరమవుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. విత్తన సవరణ బిల్లుతో కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకుంటుందని విమర్శించారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారుస్తుందన్నారు. ఓటరు సవరణతో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలకు దూరం చేస్తుందని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి.. నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు తీరని అన్యాయం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఆర్థిక పరిస్థితి పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో దైవ దర్శనం కోసం వెళ్లిన వారిపై దాడిచేసి చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అగ్రకుల అహంకారంతో దాడి చేయడమే కాకుండా.. అధికార పెత్తనంతో బాధితులపైనే కేసులు బనాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఘటనకు కారణమైన ఎస్ఐ, సీఐపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలన్నారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి 1న నిర్వహించే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం నాయకులు శ్రీరామ్ నాయక్, కిల్లె గోపాల్, జిల్లా కార్యదర్శి ఎ.వెంకటస్వామి, జి.రాజు, పరంజ్యోతి, వీవీ నర్సింహ, ఉప్పేర్ నర్సింహ, నర్మద, ఈశ్వర్, వెంకటేశ్వర్లు, మధు, అలీ అక్బర్ తదితరులు ఉన్నారు.
సీపీఎం రాష్ట్ర
కార్యదర్శి జాన్వెస్లీ


