చిన్నారి మృతి కారకులను శిక్షించాలి
నాగర్కర్నూల్ క్రైం: నాగర్కర్నూల్ మండలంలోని కుమ్మెర మల్లన్న జాతరలో చంద్రకళతోపాటు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడి.. రెండు నెలల చిన్నారి మృతికి కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ అన్నారు. శనివారం రాత్రి 7 గంటల నుంచి కుల సంఘాల ఆధ్వర్యంలో ఽజనరల్ ఆస్పత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి 11 గంటల వరకు నాలుగు గంటలపాటు ధర్నా నిర్వహించడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. జనరల్ ఆస్పత్రి నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా విశారదన్ మహరాజ్ మాట్లాడుతూ చిన్నారి మృతికి కారణమైన కుమ్మెర గ్రామ సర్పంచ్ తుకారాంరెడ్డి, సతీష్రెడ్డి, మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డిలపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని పట్టుబట్టారు. ధర్నా నాలుగు గంటలపాటు కొనసాగడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా నియోజకవర్గంలోని అన్ని పోలీస్స్టేషన్ల నుంచి ఎస్ఐలు, పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితులు, కుల సంఘాల నాయకులు ఎంతకూ ధర్నా విరమించలేదు. దీంతో డీఎస్పీ శ్రీనివాస్ ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్తో ఫోన్లో మాట్లాడించినప్పటికీ ససేమిరా ఒప్పుకోలేదు. చివరికి 11 గంటల సమయంలో ప్రయాణికులు కుల సంఘాల నాయకులను విజ్ఞప్తి చేయడంతో ధర్నాను విరమించారు. ధర్నాలో బీఎస్పీ అధ్యక్షుడు రామచందర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్, లక్ష్మణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నాలుగు గంటలపాటు కొనసాగిన ధర్నా


