దళారీ వ్యవస్థ లేకుండా పామాయిల్ అమ్మకాలు
రాజోళి/ ధరూరు: పామాయిల్ రైతులు పండించిన పంటను దళారీలు లేకుండా అమ్మకాలు చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ జిల్లా ఇన్చార్జి శివనాగిరెడ్డి అన్నారు. శనివారం వడ్డేపల్లి మున్సిపాలిటీలో పామాయిల్ రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో రోజురోజుకూ వంట నూనె అవసరాలు పెరగుతున్నాయని దానికి తగ్గట్టుగా పామాయిల్ పంట దిగుబడి రావాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం పామాయిల్ సాగులో రైతులు ఎలాంటి మెళకువలు పాటించాలో వివరించారు. ప్రధానంగా వంట నూనెల అవసరాలు తీర్చడానికి రైతులు పామాయిల్ సాగు పెంచాల్సి వస్తుందన్నారు. దీని సాగు వల్ల రైతులకు లాభాలు ఉంటాయని చెప్పారు. మూడో సంవత్సరం నుంచి ఖాతా రావడం మొదలై.. నాలుగో సంవత్సరం రైతులకు ఆదాయం వస్తుందని, ఇది దీర్ఘకాలం కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రాధ, చంద్రకళ, వినోద్, యశ్వంత్, రైతులు పాల్గొన్నారు.
సస్యరక్షణ చర్యలతో దిగుబడులు
పామాయిల్ తోటల్లో రైతులు సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు సాధించవచ్చని జిల్లా ఉద్యానవన అధికారి రాజశేఖర్ అన్నారు. శనివారం ధరూరులోని రైతువేదికలో రైతులకు పామాయిల్ సాగుపై అవగాహన కల్పించారు. దీర్ఘకాలిక, స్థిరమైన ఆదాయ వనరు పామాయిల్ సాగు అని తెలిపారు. శాసీ్త్రయమైన పద్ధతులు, ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ చర్యలు, సబ్సిడీపై అవగాహన కల్పించారు. ఆయిల్పాం తోటల సాగు పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచు విజయ్కుమార్, ఏరియా అధికారి మేఘనాథ్, మండల ఫీల్డ్ ఆఫీసర్ శివ పాల్గొన్నారు.


