ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం
గద్వాలన్యూటౌన్/ఉండవెల్లి: రైల్వే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ్ అన్నారు. మంగళవారం ప్రత్యేక రైలులో డీఆర్ఎం సంతోష్కుమార్ వర్మ, ఇతర అధికారులతో కలిసి గద్వాల, జోగుళాంబ రైల్వేస్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా గద్వాల రైల్వేస్టేషన్లో అమృత్భారత్ స్కీం కింద రూ. 42.82 కోట్లతో చేపడుతున్న స్టేషన్ ప్లాట్ఫాం విస్తీర్ణం, ఆర్చీ, వెహికిల్ పార్కింగ్, రోడ్ల పనులను ఆయన పరిశీలించారు. అనంతరం కృష్ణా రైల్వే బ్రిడ్జి వద్ద భద్రతను తనిఖీ చేశారు. ట్రాక్మేన్లతో వివరాలు తెలుసుకున్నారు. అదే విధంగా ఆరేపల్లి లెవెల్ క్రాసింగ్ వద్ద తనిఖీ నిర్వహించారు. జోగుళాంబ రైల్వే హాల్ట్లో ప్రయాణికులు కూర్చోవడానికి సరిపడా బేంచీలు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి వసతి, నీడ సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం రైల్వే హాల్ట్ డిజైన్, చేపట్టిన నిర్మాణ పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. డబుల్ ట్రాక్ పనుల పురోగతిపై ఆరా తీశారు. హైదరాబాద్వైపు ఉన్న ఫ్లాట్ఫాంపై నీడ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. కాగా, జోగుళాంబ హాల్ట్ వద్ద హైలెవల్ ఫ్లాట్ఫాం ఏర్పాటు చేయించాలని ఎంపీ మల్లు రవితో స్థానిక నాయకులు ఫోన్లో మాట్లాడించగా.. పరిశీలిస్తామని ఆయన తెలిపారు. కాగా, గ్యాంగ్మేన్లను నైట్ పెట్రోలింగ్ మ్యాన్లుగా ఒక్కరినే పంపిస్తున్నారని.. ఇద్దరిని పంపించాలని, సిగ్నల్ అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్లలో ఖాళీ పోస్టులను భర్తీ చేయా లని కోరుతూ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ అసిస్టెంట్ డివిజనల్ సెక్రెటరీ రైల్వే శంకర్ జీఎంకు వినతిప్రతం అందించారు. గద్వాల డీఆర్డీ సిబ్బందికి కొత్త క్వార్టర్స్ కేటాయించాలని.. గద్వా ల, కర్నూలు రైల్వే క్వార్టర్స్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కోరారు.


