సిబ్బంది లేక ఇబ్బంది
అయిజ: పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా 2017లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అయిజకు సబ్ డివిజన్ కేటాయించారు. నాటి నుంచి సబ్డివిజన్ కేంద్రం ఏర్పాటు చేసుకొని అయిజ, మల్దకల్, గట్టు మండలాల రైతులకు విద్యుత్ సేవలు అందిస్తున్నారు. అయితే, సబ్ డివిజన్ ఏర్పాటు వరకు బాగానే ఉన్నా.. సరిపడా సిబ్బంది లేకపోవడం, సొంత భవనం నిర్మించకపోవడం, తాత్కాలిక భవనంలో వసతులు లేకపోవడంతో అటు అధికారులు, ఉన్న సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జిల్లాలో మూడుచోట్ల సబ్ డివిజన్లు
జిల్లాలో గద్వాల, అలంపూర్, అయిజలో కలిపి మొత్తం మూడు విద్యుత్ సబ్డివిజన్లు ఏర్పాటు చేశారు. అయితే గద్వాల, అలంపూర్లో సబ్ డివిజన్లకు కార్యాలయ భవనాలు ఉన్నాయి. ఆ రెండు ప్రదేశాల్లో సబ్ డివిజన్ కార్యాలయంలో తగినంతమంది సిబ్బంది ఉన్నారు. అయిజలో సబ్ డివిజన్ ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతోంది. మూడు సంవత్సరాలపాటు ఇంచార్జ్లతో సరిపెట్టారు. గత మూడు సంవత్సరాల నుంచి రెగ్యులర్ ఏడీఈ పనిచేస్తున్నా వసతులు కరువయ్యాయి.
మౌళిక వసతులు కరువు
అయిజ విద్యుత్ సబ్ డివిజన్లో ఇంతవరకు కనీసం కార్యాలయ భవనం నిర్మించలేదు. తగిన సిబ్బంది, పరికరాలు లేకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. చిన్న గదిలో ఏఈ కార్యాలయం ఏర్పాటు చేసుకొని విధులు నిర్వహిస్తున్నారు. అదే గదిలో ఏడీఈ విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది కూర్చోవడానికి కూడా స్థలం లేకుండా పోయింది. కనీసం ఏఈలు, సిబ్బందితో సమావేశాలు నిర్వహించుకునేందుకు కూడా అవకాశం లేదు. కార్యాలయంలో కనీసం ముగ్గురు ఏఈలు, ముగ్గురు సబ్ ఇంజినీర్లు వస్తేకూడా కూర్చోవడానికి స్థలం లేదు. అలాగే, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. తొమ్మిది గ్రామాలకు లైన్మన్లు లేరు. ఒక్కో గ్రామానికి ఇద్దరు నుంచి ముగ్గురు లైన్మెన్లు ఉండాల్సి ఉండగా వెంకటాపురం, పర్దిపురం, కిస్టాపరం, యాపదిన్నె, కుర్వపల్లి, గుడుదొడ్డి, బింగుదొడ్డి, ఎక్లాస్పురం, దేవబండ గ్రామాల్లో కనీసం ఒక్కొక్క లైన్మెన్ కూడా లేరు. రాజోళి, మల్దకల్, గట్టు మండలాల్లోని సబ్ స్టేషన్లలో ముగ్గురు చొప్పున ఆపరేటర్లు ఉండాల్సి ఉండగా ఒక్కొక్కరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో వేరే వ్యక్తులతో తాత్కాలికంగా పనులు చేయిస్తున్నారు. ప్రతి సబ్స్టేషన్లలో ముగ్గురు ఆపరేట్లు ఉండాల్సి ఉండగా ఇద్దరు ఆపరేటర్లతోనే పనులు చేయిస్తున్నారు.
విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం కొనసాగుతున్నది ఈ భవనం ఇదే..
అయిజ విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయంలో సమస్యల తిష్ట
సొంత భవనం లేక అధికారులు, సిబ్బంది ఇబ్బందులు
2017లో విద్యుత్ సబ్డివిజన్ ఏర్పాటు
అయిజ, మల్దకల్, గట్టు,
రాజోళి మండలాల రైతులకు సేవలు
కూర్చోవడానికి కూడా స్థలంలేదు
రైతులు తమ గోడును వినిపించుకోవడానికి సబ్డిజన్కు వెళ్తే అక్కడ అధికారితో కనీసం కూర్చొని మాట్లాడేందుకు కూడా స్థలంలేదు. దానివలన రైతులు నిలబడి మాట్లాడి వెళ్లాల్సి వస్తుంది. కార్యాలయంలో రైతులు కనీసం ఏఈతో మాట్లాడుకుందాం అన్నా సరే అక్కడ కూడా స్థలం చాలడంలేదు. దీంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మౌళిక వసతులు ఏర్పాటు చేయాలి.
– గోవిందు, రైతు
నివేదికలు పంపించాం
సబ్డివిజన్ కార్యాలయ భవనంలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. తగినంత సిబ్బంది లేకపోవడంతో పనులు వేగంగా ముందుకు సాగడంలేదు. ఈ విషయాలను ఉన్నతాధికారులకు తెలియజేశాం. కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టాలని రెండేళ్ల క్రితం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు. – నీలి గోవిందు,
ఏడీఈ, అయిజ సబ్ డివిజన్
సిబ్బంది లేక ఇబ్బంది
సిబ్బంది లేక ఇబ్బంది


