60 డివిజన్లు, 316 వార్డులు.. 798 పీఎస్లు
పురుషులు 3,04,294..
మహిళలు 3,15,094
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పుర పాలికల ఎన్నికలకు సంబంధించి తొలి కసరత్తు పూర్తయింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు కార్పొరేషన్/మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా పోలింగ్ సెంటర్లు ఖరారు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటర్లను ప్రమాణికంగా తీసుకుని వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ముసాయిదా ఓటరు లిస్ట్ను విడుదల చేశారు. ఈ మేరకు ఆయా బల్దియా, రెవెన్యూ, కలెక్టరేట్ కార్యాలయాల నోటీస్ బోర్డుల్లో జాబితా ప్రతులను అతికించారు. ఈ నెల నాలుగు వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఐదో తేదీన ఆయా పురపాలికల్లో స్థానిక, ఆరున జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ నెల పదిన తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్తో కలుపుకుని మొత్తం 21 పురపాలికలు ఉన్నాయి. వీటిలో మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల, నాగర్కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీ మినహా మిగిలిన వాటికి ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు, మిగతా 18 మున్సిపాలిటీల్లో 316 వార్డులు ఉండగా.. మొత్తంగా 798 పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు.
మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు 18 మున్సిపాలిటీల పరిధిలో మొత్తంగా 6,19,423 మంది ఓటర్లు ఉన్నట్లు పురపాలికల అధికారులు ముసాయిదా జాబితాను వెల్లడించారు. ఇందులో పురుషులు 3,04,294, మహిళలు 3,15,094 కాగా.. ఇతరులు 35 మంది ఉన్నారు. అన్ని పురపాలికల్లోనూ పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.
● మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 82 డివిజన్లు/వార్డులు ఉన్నాయి. ఈ మేరకు 223 పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. మొత్తంగా 2,19,989 మంది ఓటర్లలో మహిళలు 1,11,416, పురుషులు 1,08,559 మంది కాగా.. ఇతరులు 14 మంది ఉన్నారు.
● వనపర్తి జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం 80 వార్డులు ఉండగా.. 162 పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. వీటి పరిధిలో మొత్తంగా 1,18,074 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 57,828, మహిళలు 60,238, ఇతరులు ఎనిమిది మంది ఉన్నారు.
● జోగుళాంబ గద్వాల జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 77 వార్డులు ఉండగా.. 145 పోలింగ్ సెంటర్లు కేటాయించారు. అదేవిధంగా మొత్తంగా 1,08,619 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 52,894, మహిళలు 55,713 మంది కాగా.. ఇతరులు 12 మంది ఉన్నారు.
● నారాయణపేట జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 72 వార్డులు ఉన్నాయి. ఈ మేరకు 138 పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. మొత్తంగా 91,859 మంది ఓటర్లలో 44,909 మంది పురుషులు, 46,949 మంది మహిళలు.. ఇతరులు ఒకరు ఉన్నారు.
● నాగర్కర్నూల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీల పరిధిలో 65 వార్డులు ఉండగా.. 130 పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. అదేవిధంగా 80,882 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 40,104 మంది కాగా.. మహిళలు 40,778 మంది ఉన్నారు.
మొత్తం 60 డివిజన్లు.. 316 వార్డుల వారీగా వెల్లడి
2023 అసెంబ్లీ ఎన్నికల ఓటర్లే ప్రామాణికంగా రూపకల్పన
బల్దియా, రెవెన్యూ, కలెక్టరేట్ కార్యాలయాల్లో జాబితా ప్రదర్శన
10న ఫైనల్ లిస్ట్.. ఆ తర్వాత ఎప్పడైనా ఎన్నికల షెడ్యూల్
60 డివిజన్లు, 316 వార్డులు.. 798 పీఎస్లు
60 డివిజన్లు, 316 వార్డులు.. 798 పీఎస్లు


