
నత్తనడకన నిర్మాణాలు
అయిజ: విధిగా పారిశుద్ధ్య పనులు చేపట్టి ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ఉండేందుకు మున్సిపాలిటీలలో ఎఫ్ఎస్టీపీ (ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్) ఏర్పాటుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల, అయిజ, బాదేపల్లి, నాగర్కర్నూల్, నారాయణపేట, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్కర్నూల్, దేవరకొండ, వనపర్తి మున్సిపాలిటీల్లో ఎఫ్ఎస్టీపీ ప్లాంట్లు నిర్మించేందుకు రూ.18 కోట్లు వెచ్చించారు. ఈ ఖర్చులో సగభాగం ప్రభుత్వం, మిగిలిన సగభాగం పీవీవీ ఎన్ఫ్రాం కంపెనీ వారు ఖర్చు చేయాలనే ఒప్పందం ఉంది.
యూనిట్ ఇంచార్జ్లదే బాధ్యత
యూనిట్ నిర్మాణం పూర్తయిన అనంతరం 10 ఏళ్లపాటు యూనిట్ నిర్వహణ బాధ్యతలు యూనిట్ ఇంచార్జ్లు తీసుకోవాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలో సెప్టిక్ ట్యాంక్ యజమానితో మున్సిపాలిటీ అధికారులు ఒప్పందం చేసుకొని సెప్టిక్ ట్యాంక్లనుంచి మానవ విసర్జితాలను ప్లాంట్కు తరలించేవిధంగా చర్యలు తీసుకుంటారు. అనంతరం ప్లాంట్లో సాంకేతిక పద్ధతిలో మలంను ఎరువుగా మార్చుతారు. ఎఫ్ఎస్టీపీలో తయారైన ఎరువును యూనిట్ నిర్వాహకులు కిలోల చొప్పున లెక్క కట్టి విక్రయిస్తారు. అది వ్యవసాయానికి ఎరువుగా ఉపయోగపడుతుంది. శుద్ధిచేసిన నీటిని మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించే హరతహారం మొక్కలకు ఉపయోగించుకోవచ్చు.
రెండు మున్సిపాలిటీల్లో వినియోగం
గద్వాల, అయిజ మున్సిపాలిటీలలో ఎస్ఎఫ్టీపీ ప్లాంట్లు వినియోగంలోకి వచ్చాయి. అయిజ మున్సిపాలిటీలో నిర్మించిన ఎస్ఎఫ్టీపీ ప్లాంట్ 2022 నుంచి ఉపయోగంలోకి తెచ్చారు. గద్వాల మున్సిపాలిటీలో 2023 ప్లాంట్ నిర్మాణం పూర్తిచేసి ఉపయోగంలోకి వచ్చింది. అయితే రెండు మున్సిపాలిటీల్లో కూడా ఇంతవరకు అధికారికంగా ప్లాంట్లను ప్రారంభించలేదు. వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీల్లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. వడ్డేపల్లి మున్సిపాలిటీలో రూ. 55 లక్షల నిధులతో 2022లో ఎఫ్ఎస్టీపీ పనులు ప్రారంభించారు. నిర్మాణ పనులు ఇంకా పూర్తి కా లేదు. అలంపూర్లో గతంలో ఏర్పాటు చేసిన ఎస్టీపీ ( సివరేజ్ ట్రీటమెంట్ ప్లాంట్) ఉన్నందుకు ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ నిర్మాంణం మంజూరును రెండు సంవత్సరాలు హోల్డ్లో పెట్టారు. ఎట్టకేలకు గతేడాది నిర్మాణ పనులు చేపట్టేందుకు అనుమతులు లభించాయి.
ఉమ్మడి జిల్లాలోనే అయిజ ప్రఽథమం
ఉమ్మడి మహబూబ్నగర్లో చేపట్టిన ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణం ముందుగా అయిజ మున్సిపాలిటీలో పూర్తయ్యింది. నివాస గృహాల సెప్టిక్ ట్యాంక్ల నుంచి సేకరించిన మానవ విసర్జితాలను శుద్ధీకరణ చేసి ఎరువు తయారు చేసేందుకు అయిజ మున్సిపాలిటీ పరిధిలోని పర్దిపురం గ్రామం సమీపంలో సుమారు రూ.1.5 కోట్లతో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను గతేడాది పూర్తి చేశారు. అయిజ మున్సిపాలిటీలోని సుమారు 7వేల నివాస కుటుంబాల నుంచి సెప్టిక్ ట్యాంకుల్లోని మానవ విసర్జితాలను తరలించేందుకు ప్లాంట్ నిర్మించారు. విసర్జితాలను శుద్ధీకరుణ యూనిట్ ప్లాంట్లో అనారోబిక్ సేఫ్టీలైజేషన్ రియాక్టర్తో మెథనైజేషన్ పద్దతిలో శుద్ధిచేసి విసర్జితం, నీటిని వేరుచేస్తారు. నీటిని పాలిసింగ్ ఫండ్లో పాస్పరేట్, సల్ఫర్ ద్వారా శుద్ధిచేసి ప్యూరిఫైడ్ వాటర్గా మార్చుతారు. 18 రోజుల తర్వాత మలం ఎరువుగా మారుతుంది. ఈప్రక్రియ మెత్తం ఆధునిక సాంకేతిక పద్ధతిలో జరుగుతుంది. ఒకసారికి 10 కేఎల్డీ (10వేల లీటర్ల సామర్ధ్యం) గల విసర్జితాలు శుద్ధిచేసే అవకాశం ఉంది. అయితే అధికారికంగా ప్లాంట్ను ప్రారంభించకపోయినా సరే నిర్వహణ మాత్రం సజావుగా సాగుతోంది.
అయిజలో నిర్మించిన ఎఫ్ఎస్టీపీ ప్లాంట్
ఎఫ్ఎస్టీపీ ప్లాంట్లపై వీడని నిర్లక్ష్యం
వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీల్లో కానరాని పురోగతి
గద్వాల, అయిజ మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న నిర్వహణ
పారిశుద్ధ్యం మెరుగు..
అయిజ మున్సిపాలిటీలో సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరించిన మానవ విసర్జితాలను శుద్ధి చేసేందుకు నిర్మించిన ఎఫ్ఎస్టీ ప్లాంట్ సద్వినియోగం అవుతోంది. ఈ ప్లాంట్లో ద్వారా విసర్జితాలు శుద్ధిచేసి ఎరువుగా మార్చి మొక్కలకు ఉపయోగించడం మంచి విషయం.
– రాజశేఖర్, ఏఈ, అయిజ మున్సిపాలిటీ
రెండేళ్లుగా కొనసాగుతోంది
అయిజ మున్సిపాలిటీలో ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ రెండేళ్ల క్రితం నుంచే వినియోగంలోకి వచ్చింది. గద్వాలలో కూడా వినియోగంలో ఉంది. అలంపూర్లో, వడ్డెపల్లిలో ఇంకా పనులు పూర్తి కాలేదు. పనులు వేగవంతం చేసేందుకు కృషిచేస్తాం. – నర్సింగరావు, అడిషనల్ కలెక్టర్

నత్తనడకన నిర్మాణాలు

నత్తనడకన నిర్మాణాలు