
జిల్లా నూతన జడ్జిల నియామకం
గద్వాల క్రైం: జోగుళాంబ గద్వాల జిల్లా జడ్జిగా ఎన్.ప్రేమలత, అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జిగా ఎస్.రవికుమార్ను నియమిస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఇక్కడ జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తున్న కె.కుషాను హైదరాబాద్ సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా బదిలీ చేశారు. కాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తున్న ఎన్.ప్రేమలతను గద్వాల జిల్లా జడ్జిగా బదిలీ చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ అయిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జిగా విధులు నిర్వహిస్తున్న ఎస్.రవికుమార్ను గద్వాల అదనపు సెషన్ కోర్టు జడ్జిగా రానున్నారు. వీరు త్వరలో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. .
నష్టపోయిన మామిడి రైతుల వివరాలు పంపండి
నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో వర్షాలు, ఈదురు గాలుల వల్ల నష్టపోయిన మామిడి రైతుల వివరాలను నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడినట్లు ఎంపీ మల్లురవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మామిడి రైతులు కూడా తమకు జరిగిన నష్టం వివరాలను కలెక్టర్తోపాటు ఆయా మండలాల్లో తహసీల్దార్ల దృష్టికి తీసుకెళ్లాలని, నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
1,070 క్వింటాళ్ల
వేరుశనగ రాక
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డుకు మంగళవారం 1,070 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.6,089, కనిష్టంగా రూ.3,019, సరాసరిగా రూ.4,926 చొప్పున ధరలు వచ్చాయి. అలాగే 25 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టంగా రూ.6,409, కనిష్టంగా రూ.2,219, సరాసరిగా రూ.6,406, 284 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ.6,001, కనిష్టంగా రూ.3,561, సరాసరిగా రూ.5,909, 2,245 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ.2,069, కనిష్టంగా రూ.1,739, సరాసరిగా రూ.1,889 చొప్పున ధరలు లభించాయి.
సమ్మె నోటీస్ ఇచ్చిన కాంట్రాక్టు అధ్యాపకులు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులు రిజిస్ట్రార్ రమేష్బాబుకు మంగళవారం సమ్మె నోటీస్ను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో ఒప్పంద అధ్యాపకులు ఏళ్లుగా యూనివర్సిటీలో పని చేస్తున్నారని, అలాంటి వారిని రెగ్యులరైజ్ చేయాలని, బడ్జెట్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులలో పనిచేస్తున్న వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉన్న ఫలంగా నోటిఫికేషన్ ఇచ్చి కాంట్రాక్టు అధ్యాపకుల గొంతు నొక్కవద్దన్నారు. కార్యక్రమంలో శ్రీధర్రెడ్డి, భూమయ్య, రవికుమర్, విజయ్భాస్కర్, ప్రభాకర్రెడ్డి, సోమేశ్వర్, సుదర్శన్రెడ్డి, రవికుమార్, మృదుల తదితరులు పాల్గొన్నారు.

జిల్లా నూతన జడ్జిల నియామకం

జిల్లా నూతన జడ్జిల నియామకం