
కదలిక వచ్చేనా?
‘ర్యాలంపాడు’ లీకేజీలను పరిశీలించిన నిపుణుల బృందం
●
మరమ్మతు చేయాలి
ర్యాలంపాడు రిజర్వాయర్ కింద మాకు ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఏటా వరిపంట సాగుచేస్తాను. ర్యాలంపాడు రిజర్వాయర్కు లీకేజీలు ఏర్పడడంతో రిజర్వాయర్లో సగానికే నీటిని నింపుతున్నారు. దీంతో తమ పంటలకు పూర్తిగా నీరు అందడంలేదు. రెండేళ్లుగా ఖరీఫ్ సీజన్లో వారబంధి విధానంతో నీటిని వదిలారు. పంటలకు పూర్తిగా నీరుపారక ఇబ్బందిపడ్డాను. ఈసారైన రిజర్వాయర్కు రిపేర్లు చేయాలి. – రాముడు,
రైతు దోర్నాల, ధరూరు మండలం
పంటలకు నీరు అందించాలి
రిజర్వాయర్ కింద 4ఎకరాల భూమి ఉంది. ఇందులో రెండెకరాలలో వరి, మరో రెండెకరాలలో పత్తిపంటను పండిస్తాం. ర్యాలంపాడు రిజర్వాయర్కు లీకేజీలు పడి రిపేర్లు చేయకపోవడంతో మూడేళ్లుగా ఒక్క పంటనే పండించుకుంటున్నాను. కొత్త ప్రభుత్వమైనా స్పందించి త్వరగా రిపేర్లు చేసి తమ పంటలకు నీరు అందించి ఆదుకోవాలి.
– తాయప్ప, రైతు, కేటీదొడ్డి
నిధులు విడుదల చేస్తేనే..
మరమ్మత్తులకు సంబంధించి నివేదిక హైదరాబాదులోని సీఈ కార్యాలయం టెక్నికల్ విభాగం పరిశీలనలో ఉంది. దీనిపై తుది నిర్ణయం వెలువడి, నిధులు విడుదల చేస్తే వెంటనే పనులు ప్రారంభిస్తాం. అప్పటి వరకు జలాశయం రక్షణలో భాగంగా సగానికే నీటిని నిల్వ చేస్తాం.
– రహీముద్దీన్, ఎస్ఈ ఇరిగేషన్శాఖ
వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రూ.వేల కోట్లతో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు కొందరు కాంట్రాక్టర్ల స్వార్థం.. అధికారుల అవినీతి మూలంగా వాటి ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. లోపభూయిష్టమైన నిర్మాణాల కారణంగా ఒకటి కాదు రెండు కాదు ర్యాలంపాడు జలాశయం కుడి, ఎడమ అడుగు భాగాలు, రాక్టోల్ ప్రాంతాలు.. మొత్తం లీకేజీలమయంగా మారింది. రూ.కోట్లాది ప్రజాధనం మట్టికొట్టుకుపోతుంది.
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని ర్యాలంపాడు జలాశయం ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. తాజాగా గురువారం లీకేజీలను పూణె నిపుణుల కమిటీ పరిశీలించింది. ఈ కమిటీ సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. దీంతోనైనా ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతు పనుల్లో కదలిక వస్తుందేమో.. మా పంటలకు నీటి కష్టాలు
తీరుతాయేమోనని ఆయకట్టు రైతులు ఎదురుచూస్తున్నారు. – గద్వాల
నడిగడ్డ ప్రాంతంలో 2లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలని నిర్మించిన నెట్టెంపాడు ప్రాజెక్టులో ర్యాలంపాడు జలాశయం గుండెకాయ లాంటిది. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 2లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని నెట్టెంపాడు ప్రాజెక్టులో ఏడు జలాశయాలు నిర్మించారు. ఇందులో సంగాల, చిన్నోనిపల్లి జలాశయాలు స్టాండ్బై కింద కేవలం నీటిని నిల్వ చేసుకునేందకు నిర్మించగా, మరో 5 జలాశయాలు ఆయకట్టుకు నీరు పారించేలా నిర్మించారు. ఇందులో ర్యాలంపాడు జలాశయం కింద 1.05లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4టీఎంసీలుగా నిర్మాణం చేశారు. ఈ జలాశయం ద్వారా, ధరూరు, కేటీదొడ్డి, మల్దకల్ మండలాల పరిధిలో ఆయకట్టుకు సాగునీరు పారుతుండగా మరోవైపు 2.80టీఎంసీల సామర్థ్యంతో 1.36 లక్షల ఎకరాలకు సాగునీరు పారించేలా రూ.580కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న గట్టు ఎత్తిపోతలకు కూడా అవసరమైన 2.80టీఎంసీల నీటిని ర్యాలంపాడు జలాశయం నుంచే ఎత్తిపోసేలా నిర్మాణం చేపట్టారు. అందుకే సాగునీటి నిపుణులు ఈ ర్యాలంపాడు జలాశయాన్ని ప్రాజెక్టుకు గుండెకాయగా పిలుస్తారు.
సమగ్ర వివరాలు సేకరణ
నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశం
జలాశయానికి కుడి, ఎడమ అడుగు భాగాలు, రాక్టోల్ ప్రాంతాల్లో పలుచోట్ల లీకేజీల గుర్తింపు
మరమ్మతులకు రూ.137 కోట్ల అంచనా నివేదిక
జలాశయం నిండక.. ఆయకట్టు రైతుల అష్టకష్టాలు

కదలిక వచ్చేనా?

కదలిక వచ్చేనా?