గుర్రంగడ్డ పనుల్లో కదలిక | - | Sakshi
Sakshi News home page

గుర్రంగడ్డ పనుల్లో కదలిక

Mar 18 2025 12:32 AM | Updated on Mar 18 2025 12:33 AM

నూతన ఏజెన్సీకి వంతెన నిర్మాణ పనులు

కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో..

గత ప్రభుత్వం 2018లో రూ.12కోట్లతో బ్రిడ్జీ నిర్మాణం చేపట్టాలని పనులు మొదలుపెట్టింది. అయితే పనుల దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పనులు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వచ్చాడు. దీనిపై అధికారులు పలుమార్లు నోటీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కాంట్రాక్టర్‌లో మాత్రం చలనం లేదు. దీంతో గత ఏడేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. తాజాగా సదరు కాంట్రాక్టర్‌పై అధికారులు వేటు వేశారు. 60సీ నోటీసులు జారీ చేసి పాత కాంట్రాక్టర్‌, కన్‌స్ట్రక్షన్‌ ఏజెన్సీని తొలగించి నూతనంగా మరో ఏజెన్సీకి పనులు అప్పగించారు. దీంతో పనులు దక్కించుకున్న ఏజెన్సీ పనులు మొదలుపెట్టింది. ప్రస్తుతం పనులు వేగవంతం సాగుతున్నాయి. వేసవి కాలంలో పనులు వేగవంతం చేసి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని.. తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని గుర్రంగడ్డ వాసులు కోరుతున్నారు.

గద్వాల: ఏడాదిలో ఆర్నెళ్లు దీవిలో.. మరో ఆర్నెళ్లు మైదాన ప్రాంతంలో జీవిస్తున్నారు గుర్రంగడ్డవాసులు. విద్య, నిత్యావసర వస్తువులు, అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలు పొందాలన్నా పుట్టీల సాయంతో నది దాటాల్సిందే. కృష్ణానదిలో ఏకై క దీవి గ్రామం ఇదే. వంతెన నిర్మించి తమ కష్టాలు తీర్చాలని ఏళ్లుగా గుర్రంగడ్డ వాసులు కోరుతున్నా.. బ్రిడ్జి నిర్మాణం మాత్రం పూర్తవడంలేదు. తాజాగా వంతెన నిర్మాణ పనులను కొత్త ఏజెన్సీకి అప్పగించామని, పనులు వేగవంతం చేసి కష్టాలు తొలగిస్తామని అధికారులు పేర్కొంటుండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వానాకాలం సీజన్‌లో భారీగా కురిసే వర్షాలకు వరద వచ్చి చేరడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటుంది. ఈ సమయంలో గుర్రంగడ్డ వాసులు పుట్టీలు, పడవల ద్వారా ప్రయాణించాల్సిందే. ఈక్రమంలో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నది మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. ఈగ్రామంలో మొత్తం 600 కుటుంబాలు నివాసం ఉంటుండగా 450 మంది వరకు ఓటర్లున్నారు. మొత్తం వ్యవసాయ భూమి విస్తీర్ణం 2100 ఎకరాలు కాగా ఇందులో సుమారు 1600 ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలు సాగుచేస్తారు. ఇందులో ప్రధాన పంట వరి. ఇలాంటి పరిస్థితిలో నదిలో భారీగా వరద ప్రవహిస్తున్నప్పుడు బాహ్యప్రపంచంతో దీవివాసులకు పూర్తిగా సంబంధాలు కోల్పోతాయి. ఏడాదిలో ఆర్నెళ్ల వరకు ఈ కష్టాలు వెంటాడుతుంటాయి.

ఆర్నెళ్లు నది మధ్యలోనే..

కృష్ణానదిలో ఏకై క దీవి గ్రామం..

అత్యవసర పరిస్థితుల్లో నది దాటేందుకు తీవ్ర ఇబ్బందులు

వంతెన నిర్మాణంతో తీరనున్న కష్టాలు

ఏడాదిలో పూర్తి చేస్తాం

2018లో రూ.12కోట్లతో గుర్రంగడ్డ వంతెన నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పనులు చేయలేదు. దీంతో పాత ఏజెన్సీకి 60సీ నోటీసులు ఇచ్చి తొలగించాం. కొత్త ఏజెన్సీకి వంతెన నిర్మాణ పనులు అప్పగించాం. వచ్చే ఏడాది నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.

– రహీముద్దీన్‌, ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement