ఆటోమెటిక్గా జనరేట్ అవుతుంది..
కాళేశ్వరం: మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సరిహద్దు తిప్పలు తప్పడం లేదు. ఒకే బస్సు.. ఒకే సీటు.. ఒకే ప్రయాణం.. కానీ మహిళా ప్రయాణికులకు మాత్రం రెండు టికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రాష్ట్ర సరిహద్దు దాటి మహారాష్ట్ర భూభాగం గుండా సాగే మార్గాల్లో ఆర్టీసీ మహిళలకు ఉచిత జీరో టికెట్తో పాటు అదనంగా నగదు చార్జీలు వసూలు చేస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు.
సరిహద్దు కారణంగా..
భూపాలపల్లి నుంచి వయా సిరొంచ మీదుగా, మంచిర్యాల నుంచి చెన్నూర్ మీదుగా కాళేశ్వరం వెళ్లే మహిళలు ఉచిత జీరో టికెట్తోపాటు అదనంగా నగదు చెల్లించి మరో టికెట్ తీసుకోవాల్సి వస్తోంది. దీంతో సరిహద్దు కారణంగా ఉచిత ప్రయాణ పథకానికి కోత పడుతోందంటూ మహిళా ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు కిలోమీటర్లకే చార్జీ
భూపాలపల్లి నుంచి కాళేశ్వరం మీదుగా గోదావరి దాటి, మంచిర్యాల, చెన్నూర్ నుంచి కాళేశ్వరానికి వెళ్లే ఆర్టీసీ బస్సులు ప్రాణహిత నది దాటి మహారాష్ట్రలోని సిరోంచ పరిధిలోకి ప్రవేశిస్తాయి. తిరిగి చెన్నూర్, కాళేశ్వరం వైపునకు వస్తాయి. ఈ మార్గంలో మహారాష్ట్ర పరిధిలో ఉన్న సుమారు నాలుగు కిలోమీటర్లలోపు దూరానికి మహిళల నుంచి రూ.30 చార్జీ వసూలు చేస్తున్నారు. దీంతో తెలంగాణలోనే ప్రారంభమై.. తెలంగాణలోనే ముగిసే ప్రయాణంలో మధ్యలో కొంత దూరానికి మహిళలు నగదు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆరు షెడ్యూళ్లు.. 20 ట్రిప్పులు
భూపాలపల్లి నుంచి కాళేశ్వరం మీదుగా నాలుగు ట్రిప్పులు, మంచిర్యాల డిపో నుంచి మంచిర్యాల, చెన్నూర్–కాళేశ్వరం మార్గంలో ఆరు షెడ్యూళ్లలో దాదాపు 20 ట్రిప్పులు నడుస్తున్నాయి. ఆసిఫాబాద్ నుంచి ఒకటి, ఆదిలాబాద్ నుంచి మరో రెండు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. మంచిర్యాల నుంచి కాళేశ్వరానికి సుమారు 76 కిలోమీటర్లు, కాళేశ్వరం టు చెన్నూర్కు సుమారు 37 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
భక్తులకు తప్పని తిప్పలు
కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి వెళ్లే మహిళా భక్తులు, స్థానిక ప్రయాణికులు ఈ మార్గంలో ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా దసరా సెలవులు, కార్తీకమాసం, ప్రత్యేక ఉత్సవాల వంటి ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ సమయంలో సరిహద్దు పరిధిలో చార్జీ వసూలు చేయడం వల్ల మహిళలపై అదనపు భారం పడుతుందని పలువురు పేర్కొంటున్నారు.
మహదేవపూర్కు చెందిన శ్రీదేవి (పేరు మార్చాం) భర్తతో చిన్న గొడవ పడింది. తన పుట్టిళ్లు చెన్నూర్కు వెళ్లేందుకు మహదేవపూర్లో భూపాలపల్లి డిపో ఆర్టీసీ బస్సు ఎక్కింది. కండక్టర్ టికెట్ అడగ్గా ఆధార్ కార్డు చూపించింది. రూ.30 అదనంగా చార్జీ తీసుకున్నాడు. మహాలక్ష్మీ పఽథకం ఉచితం కదా అని అడిగింది. మహారాష్ట్రలోకి ప్రవేశిస్తున్నందున అదనంగా ఆర్టీసీ చార్జీ వేస్తున్నట్లు వివరించాడు. ఆమె వద్ద చిల్లిగవ్వ చేతిలో లేకపోవడంతో ఫోన్పే చేసి రూ.30 చెల్లించింది.
మహారాష్ట్ర భూభాగం సరిహద్దు పేరిట చార్జీ
ఇబ్బందులు పడుతున్న
మహిళలు, భక్తులు
తెలంగాణలో మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచితం ప్రయాణం చేయవచ్చు. మహా రాష్ట్రలో లేదు కనుక ఆటోమెటిక్గా చార్జీ జనరేట్ అవుతుంది. తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి వెళుతున్నందున ఆర్టీసీ మార్గదర్శకాల ప్రకారం తప్పకు ండా చార్జీలు చెల్లించాలి. మహిళలు గమనించాలి.
– మురళీకృష్ణ, డిపో మేనేజర్, భూపాలపల్లి


