బ్యాగ్లెస్ డే కార్యక్రమంలో భాగంగా కాళేశ్వరం పీఎంశ్రీ పాఠశాలలో నృత్యం చేస్తున్న విద్యార్థినులు
కాళేశ్వరం: విద్యార్థులను పుస్తకాలు, తరగతి గది బోధనకే పరిమితం చేయకుండా అనుభవాత్మక అభ్యాసం వైపు తీసుకెళ్లేందుకు విద్యాశాఖ ‘10 బ్యాగ్లెస్ డేస్’ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఈ నెల మూడో శనివారం నుంచే ఈ కార్యక్రమం అమలుకు మార్గదర్శకాలను జారీ చేసింది. గుర్తించిన నెలల్లో మూడో శనివారం బ్యాగ్లెస్ డే కార్యకలాపాలు నిర్వహించాలని మూడు రోజుల కిందట స్కూల్ తెలంగాణ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్నికోలస్ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. నిర్ణయించిన తేదీల్లోనే అన్ని పాఠశాలలు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నిర్వహించాల్సి ఉంది.
తరగతికి అనుసంధానం..
బ్యాగ్లెస్ డేస్లో తరగతి గది అభ్యాసం, నిజ జీవిత పరిస్థితులతో అనుసంధానం చేయాలని సూచించారు. పరిశీలన, అన్వేషణ, ఆచరణాత్మక అనుభవాల ద్వారా విద్యార్థులు విషయాలను అర్థం చేసుకునేలా ఉపాధ్యాయులు కార్యక్రమాలను రూపొందించాలి. ప్రశ్నలు అడగడం, అన్వేషించడం స్వయంగా చేసి నేర్చుకోవడాన్ని ప్రొత్సహించాలి. విద్యార్థుల వయసు, తరగతి, ఆసక్తులకు అనుగుణంగా కార్యక్రమాలను ఎంపిక చేయాలి. ఇండోర్, అవుట్డోర్ అభ్యసనాలు, ప్రయోగాలు, చేతితో చేసే కార్యకలా పాలు, క్విజ్లు, చారిత్రక సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రాధాన్యత ఉన్న ప్రాదేశాలు సందర్శించాలి.
ప్రణాళికలు తయారుచేయాలి..
ప్రతీ పాఠశాల బ్యాగ్లెస్ డే కార్యకలాపాల కోసం వార్షిక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. విద్యార్థుల వయసు, తరగతి, ఆసక్తులు, స్థానిక పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులను పరిగణనలోకి తీసుకుని ముందుగానే కార్యక్రమాలను సిద్ధం చేయాలి. అవసరమైన సామగ్రిని కూడా ముందస్తుగా సమకూర్చుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
హెచ్ఎం, ఉపాధ్యాయులదే కీలకపాత్ర
బ్యాగ్లెస్ డే కార్యక్రమాల ప్రణాళిక, అమలును ప్రధానోపాధ్యాయులు సమన్వయం చేయాలి. ఉపాధ్యాయులు కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణలో భాగస్వాములు కావాలి. విద్యార్థుల భద్రత, సంక్షేమాన్ని నిర్ధారించడంతో పాటు కార్యక్రమాల అమలును పర్యవేక్షించి అవసరమైన మార్గదర్శకత్వం అందించాలి. ఉపాధ్యాయులు విద్యార్థుల వయసు, తరగతికి తగిన కార్యకలాపాలను నిర్వహిస్తూ వారిని చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించాలి. పరిశీలన, సృజనాత్మకత, టీమ్వర్క్, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించేలా కార్యక్రమాలు ఉండాలని సూచించారు. అవసరమైన సందర్భాల్లో తల్లిదండ్రులు, సమాజ సభ్యులను కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయవచ్చు.
పిల్లలపై
ప్రత్యేక శ్రద్ధ..
ప్రత్యేక అవసరాలున్న పిల్లలు (సీడబ్లూఎస్ఎన్) కూడా అన్ని అనుకూల కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. వ్యక్తిగత అవసరాలు, సామర్థ్యాలకు అనుగుణంగా కార్యకలాపాలను రూపొందించి అవసరమైన సహాయాన్ని అందించనున్నారు. అవసరమైనప్పుడు ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సంరక్షకులు సహకారం తీసుకోనున్నారు.
జిల్లాలో ప్రారంభమైన కార్యక్రమం
3రోజుల క్రితం విద్యాశాఖ ఉత్తర్వులు మూడో శనివారం నిర్వహించాలని నిర్ణయం
సృజనాత్మకత, నైపుణ్యాల పెంపు లక్ష్యం విద్యార్థుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యం


