● జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి లలిత
భూపాలపల్లి అర్బన్: ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు విద్య, రక్షణ, సంరక్షణపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి ఎల్.లలిత అన్నారు. సమగ్ర శిక్ష తెలంగాణ, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల విద్యార్థులు, తల్లిదండ్రులు, సీఆర్పీలు, ఎంఐఎస్లు, సీఓలు, కార్యాలయ సిబ్బందికి శుక్రవారం ఏఎస్ఆర్ గార్డెన్స్లో అవగాహన సదస్సు నిర్వహించారు. సీఎంఓ సామల రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి డీఈఓ హాజరై మాట్లాడారు. శారీరక, మానసిక, ఇంద్రియ, అభ్యసన సంబంధిత వైకల్యాలున్న విద్యార్థులకు సాధారణ పిల్లలతో పోలిస్తే ప్రత్యేక విద్యా విధానాలు, రక్షణ, సంరక్షణ అవసరమవుతాయని తెలిపారు. దృష్టి, శ్రవణ, వాక్–భాషా, చలన వైకల్యం, మతి స్థిమితం లేకపోవడం, అభ్యసన వైకల్యాలతో పాటు కమ్యూనికేషన్, సామాజిక పరస్పర చర్యల్లో ఇబ్బందులు ఉన్న విద్యార్థుల అవసరాలను గుర్తించి సహకరించాలన్నారు. రిసోర్స్ పర్సన్లు ప్రత్యేక విద్య, సమగ్ర విద్య, సమ్మిళిత విద్య విధానాలపై అవగాహన కల్పించారు. ప్రత్యేక అవసరాలున్న వారికి ప్రభుత్వం అమలుచేస్తున్న చట్టాలు, పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 4 శాతం, విద్యలో 5 శాతం రిజర్వేషన్ వంటి అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ పింగిళి విజయపాల్రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి, మండల విద్యాశాఖ అధికారి అజ్మీర దేవా, సీఆర్పీలు, ఐఈఆర్పీలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


