భూపాలపల్లి రూరల్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ త్యాగాలు తరతరాలకు స్ఫూర్తి దాయకమని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అన్నారు. చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి ఇందిర ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్కుమార్ వివిధ బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం ఐలమ్మ సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. అన్యాయం, అణచివేతలకు వ్యతిరేకంగా ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలు సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ రాజేశ్వరి, జిల్లా రజక సంఘం అధ్యక్షుడు పున్నం రవి, సంఘాల నాయకులు సాంబమూర్తి, పైడిపల్లి రమేశ్, సూరయ్య, గోపరాజు రాజు, శ్రవణ్, అనిల్, షఫీ, రవీందర్ పాల్గొన్నారు.


