ఈసారి ఎంతమంది?
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల సంఘం తాజా షెడ్యూల్ను విడుదల చేయడంతో కసరత్తు మొదలైంది. ఇప్పటికే ఓటరుగా నమోదైన వారు సైతం మళ్లీ ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పాత జాబితాలో పేరు ఉన్నదనే కారణంతో కొత్త జాబితాలో పేరు ఆటోమేటిక్గా కొనసాగదు.
2021లో 5.05 లక్షల మంది..
2024 ఉప ఎన్నికలో తగ్గిన ఓటర్లు..
వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2021 మార్చిలో ఎన్నికలు జరిగాయి. అప్పటి జాబితాలో 5,05,565 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3,32,634 మంది పురుషులు, 1,72,864 మంది మహిళలు, 67 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 1,81,313 మంది ఓటర్లు నమోదయ్యారు. ఆ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం సాధించారు. కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంనుంచి పల్లా రాజేశ్వర్రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో 2024లో ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. 2024 ఉప ఎన్నిక తుది ఓటర్ల జాబితాలో 4,61,806 మంది పట్టభద్ర ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,87,007 మంది పురుషులు, 1,74,794 మంది మహిళలు, ఐదుగురు ఇతర ఓటర్లు ఉన్నారు.
అవసరమైన అర్హతలు ఉండాలి..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాను కొత్తగా రూపొందించనున్నారు. ఇందుకోసం అర్హులైన పట్టభద్రులు నిర్ణీత గడువులో ఫారం–18 సమర్పించాలి. గతంలో ఇదే నియోజకవర్గంలో ఓటు వేసినవారు, ప్రస్తుతం ఓటు ఉన్నవారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతో విద్యార్హతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. ఓటు హక్కు పొందేందుకు డిగ్రీ ఉంటే సరిపోదు. ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్ణీత అర్హత తేదీ నాటికి పట్టభద్రుడై ఉండటంతోపాటు అవసరమైన అర్హతలతో గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.
2021 ఎన్నికతో పోలిస్తే 2024 ఉప ఎన్నిక నాటికి ఓటర్ల సంఖ్య తగ్గింది. ఇప్పుడు మరోసారి కొత్తగా పట్టభద్రుల ఓటర్ల జాబితాను రూపొందించనుండడంతో ఈసారి ఎంతమంది అర్హులు దరఖాస్తు చేసుకుంటారు? తుది జాబితాలో ఓటర్ల సంఖ్య ఎంతకు చేరుతుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. అర్హత ఉన్న ప్రతీ పట్టభద్రుడు ఫారం–18 దరఖాస్తు చేయడం కీలకం. నవంబర్ 6 తర్వాత మిగిలిన ప్రక్రియ కొనసాగి, డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా వెలువడనుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఓటర్ల నమోదుపై దృష్టి సారించిన ప్రధాన పార్టీలు.. పోటాపోటీగా నమోదు చేయించేందుకు వ్యూహరచనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2021 ఎన్నికలకంటే ఈసారి 15 నుంచి 25 శాతం వరకు ఓటర్లు పెరగవచ్చన్న చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్సీ ఓటుకు మళ్లీ ‘ఫారం–18’
సమర్పించాల్సిందే
ఈనెల 28న నోటీసు.. నవంబర్
6 వరకు దరఖాస్తుల స్వీకరణ
నవంబర్ 25న ముసాయిదా..
డిసెంబర్ 30న తుది జాబితా


