జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల్లో అమలు కాని సిటిజన్ చార్ట్
జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ కార్యాలయాల్లో పౌరులకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘సిటిజన్ చార్ట్’ సేవల్లో జాప్యం జరుగుతోంది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పింఛన్ సేవలు, ఇంటి నిర్మాణ అనుమతులు, నల్లా పన్ను, టౌన్ ప్లానింగ్ తదితర సేవల కోసం పట్టణ ప్రజలు మున్సిపల్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. బుధవారం జిల్లాలోని రెండు మున్సిపాలిటీ సేవలు, సిటిజన్ చార్ట్ అమలుపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. –జనగామ
జనన, మరణ ధ్రువీకరణ
పత్రాల జారీలో ఆలస్యం
జనగామ మున్సిపాలిటీలో సిటిజన్ చార్ట్ అమలు, సేవల విషయంలో కొంత మెరుగుదల కనిపిస్తున్నా.. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పింఛన్ సేవల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ తదితర విభాగాల్లో సేవలు సజావుగా అందుతున్నాయి. ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు 30 ఇళ్ల నిర్మాణ అనుమతులు మంజూరు చేయగా.. రెండు దరఖాస్తులు స్వల్ప సవరణ కోసం హోల్డ్లో ఉంచి, వాటిని పూర్తి చేయాలని యజమానులకు సూచించారు. అయితే జనన, మరణ ధ్రువపత్రాల కోసం వచ్చిన వారికి సంబంధిత అధికారి అందుబాటులో లేకపోవడం, సరైన సమాచారం అందకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇక పింఛన్ కోసం వచ్చే వారికి ఎవరిని సంప్రదించాలో స్పష్టత లేకపోవడంతో ఆవేదన వ్యక్తమవుతోంది. కమిషనర్ రాజశేఖర్రెడ్డి, చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. కలెక్టర్ కూడా పురపాలిక సేవలపై ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
పేరుకే మున్సిపాలిటీ..
కనిపించని సిటిజన్ చార్ట్ బోర్డు
స్టేషన్ఘన్పూర్: డివిజన్ కేంద్రమైన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీగా ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు గడిచి పోతున్నా ప్రధాన శాఖల అధికారులందరూ ఇన్చార్జ్లు గానే ఉండడంతో పురపాలికలో పూర్తిస్థాయిలో సేవలు అందడం లేవు. మున్సిపాలిటీ కార్యాలయంలో ఉండాల్సిన సిటిజన్ చార్ట్ కార్యాలయ మాడిఫికేషన్లో భాగంగా పదిరోజుల క్రితం తొలగించారు. ప్రస్తుతం సిటిజన్ చార్ట్ కనిపించడం లేదు. సిటిజన్ చార్ట్లో పేర్కొన్న విధంగా ఏ ఒక్క పని జరగడం లేదు. టౌన్ ప్లానింగ్ అధికారి ఇన్చార్జ్ కావడం, ప్రతీ వారం శుక్ర, శనివారాల్లో మాత్రమే రావడంతో ఇంటి నిర్మాణాల అనుమతుల కోసం వచ్చే ప్రజలు రోజుల తరబడి తిరగాల్సి వస్తుంది. మున్సిపల్ కమిషనర్, మేనేజర్, ఏఈ, సీనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్ మినహా అందరూ ఇన్చార్జ్లే ఉన్నారు. వివిధ సర్టిఫికెట్ల కోసం మున్సిపాలిటీకి వస్తున్న ప్రజలు రోజుల తరబడి తిరగాల్సి వస్తుంది.
సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం
ఇబ్బందుల్లో పట్టణ వాసులు
‘సాక్షి’ విజిట్లో పలు విషయాలు
వెలుగులోకి..


