జనగామ: జనగామ వైద్య కళాశాలకు పీజీ సీట్ల కేటాయింపునకు సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) బృందం బుధవారం మరోసారి కళాశాలను సందర్శించి వసతి, వైద్య సౌకర్యాలను పరిశీలించింది. గుజరాత్కు చెందిన అనస్తీషియా విభాగం ఇన్స్పెక్టర్, ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన గైనకాలజీ విభాగం ప్రతినిధులు పరిశీలనలో పాల్గొన్నారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమణి, జనగామ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్తో కలిసి ఎన్ఎంసీ బృందం పీజీ సీట్ల కేటాయింపునకు అవసరమైన మౌలిక వసతులు, బోధనా సిబ్బంది, వైద్య పరికరాలు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. చంపక్హిల్స్లోని ప్రస్తుత మెడికల్ కళాశాలతో పాటు నూతనంగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కళాశాల భవనాన్ని బృందం పరిశీలించింది. 11 పీజీ సీట్లకు సంబంధించి తాజా పరిశీలన పూర్తయింది. జనగామ మెడికల్ కళాశాలకు వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 50 పీజీ సీట్లు కేటాయించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ఫ్యాకల్టీ, బోధన, వైద్య పరికరాలు, మౌలిక వసతులు, వసతి సౌకర్యాల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ఎన్న్ఎంసీకి అధికారులు ఇప్పటికే ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. కేంద్ర బృందం పరిశీలన అనంతరం పీజీ సీట్ల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


