జనగామ రూరల్: మట్టి గణపతులను పూజించి ప్రతిఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్లతో కలిసి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, ముస్లిం శాంతి కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం కార్యక్రమాలపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 770 చెరువులు ఉన్నాయని, దాదాపుగా జిల్లాలో 2వేల గణేష్ ప్రతిమల నిమజ్జనం జరుగుతుందన్నారు. గణేష్ మండపాల వద్ద రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను స్పష్టంగా గుర్తించే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వీధి లైటింగ్ పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలని డీపీఓకు ఆదేశించారు. నిమజ్జన ఘాట్ల వద్ద భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అన్ని శాఖలతో సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో శోభాయాత్ర సాగే ప్రధాన మార్గాల్లో, నిమజ్జన ఘాట్ల వద్ద పోలీస్ శాఖ పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. డీసీపీ మాట్లాడుతూ వినాయక మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ వెబ్సైట్లో పూర్తి వివరాలను నమోదు చేసి, అనుమతి పొందాలన్నారు. అనంతరం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్ర మంలో ఆర్డీఓలు గోపీరాం, కిరణ్ ప్రకాష్, వర్ధన్నపేట ఏసీపీలు భీం శర్మ, నర్సయ్య, మున్సిపల్ కమిషనర్లు రాజశేఖర్ రెడ్డి, రాధాకృష్ణ, డీపీఓ వెంకట్ రెడ్డి, మత్స్య శాఖ అధికారి రాణా ప్రతాప్, ఎస్ఈ ఎన్పీడీసీఎల్ సంపత్ రెడ్డి, డీఎంహెచ్ఓ వాణి శ్రీ, ఆర్టీఓ శిల్ప తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


