● జిల్లా వ్యాప్తంగా వైభవంగా బోనాల పండుగ
● చివరి ఆదివారం ఆలయాలకు పోటెత్తిన భక్తులు
జిల్లా కేంద్రంలోని పోచమ్మ అమ్మవారికి పూజలు, బోనాలతో ఆలయానికి వచ్చిన భక్తులు
జనగామ: పవిత్ర శ్రావణమాసం చివరి ఆదివారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలు, పట్టణాల్లో అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలోని పోచమ్మ, మహంకాళ మ్మ, ఇరికి మైసమ్మ ఆలయాల్లో బోనాల పండుగను పెద్ద ఎత్తున నిర్వహించారు. బోనాలతో పెద్ద ఎత్తున నిర్వహించిన ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎడ్లబండ్లు, కోలాటాలు, కళాకారుల విన్యాసాలు భక్తులను అలరించాయి. డప్పుల మోతలు, భక్తిగీతాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. పలువురు శివసత్తులు పూనకాలతో భక్తులను ఆకట్టుకున్నారు.


