ఆదివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
జనగామ: ఒకేరోజు ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టడంతో జనగామలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. 420 హామీలు, ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ‘బాకీకార్డు’ పేరుతో నిరసన చేపట్టగా... కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన విజయవంతమైందని ప్రచారం చేస్తూ జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి, డీసీసీ ధన్వంతిలక్ష్మీనారాయన నాయక్ నేతృత్వంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. రెండు పార్టీల ర్యాలీలు ఒకే మార్గంలోకి చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
ఒకవైపు నిరసన.. మరోవైపు విజయోత్సవం..
కాంగ్రెస్ ర్యాలీ ఆర్టీసీ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైంది. బీఆర్ఎస్ శ్రేణులు రైల్వేస్టేషన్ ప్రాంగణం నుంచి వేలాది మందితో ర్యాలీగా బయలు దేరారు. రెండు ర్యాలీలు గాంధీ విగ్రహం సమీపానికి చేరుకునే సమయంలో ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. జెండాలతో ఒకరికొకరు ఎదురెదురుగా నిలవడంతో కార్యకర్తల మధ్య ఉద్రిక్తత పెరిగింది.
పోలీసుల ముందస్తు వ్యూహం
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు ముందుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీసీపీ (ఐపీఎస్) రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఏసీపీలు భీంశర్మ, నర్సయ్య, పట్టణ సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సైలు, ఆర్ముడ్, సివిల్ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. నెహ్రూ పార్క్ నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు భారీ గేట్లు ఏర్పాటు చేసి, డివైడర్కు ఇరువైపులా రోప్ పార్టీలను ఏర్పాటు చేశారు. ఇరువర్గాలు పరస్పరం దాటి వెళ్లకుండా పోలీసులు నిరంతరం నిఘా పెట్టారు. అలాగే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కార్యకర్తలను సముదాయిస్తూ ముందుకు వెళ్లగా, కాంగ్రెస్ తరఫున యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ కార్యకర్తల వద్దకు వచ్చి శాంతింపజేశారు. మరోవైపు ప్రధాన రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
విద్యార్థుల రాస్తారోకోతో మరింత ఒత్తిడి
ఇదే సమయంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి ఐక్యవేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. దీంతో పోలీసులకు అదనపు భద్రతా బాధ్యతలు ఏర్పడ్డాయి.
రాజకీయ పోరులో పోలీసులకు పరీక్ష
బీఆర్ఎస్, కాంగ్రెస్ ర్యాలీలు
జెండాలతో పోటీ.. నినాదాల హోరు
గాంధీ విగ్రహం వద్ద ఉద్రిక్తత
ఒకే మార్గంలో ఎదురెదురుగా
ఇరు పార్టీల ర్యాలీలు
అరగంట పాటు టెన్షన్..
పోలీసుల సమయస్ఫూర్తి
జెండాల ఏర్పాటుపై ఘర్షణ
ఆర్టీసీ చౌరస్తాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ జెండాల ఏర్పాటుపై ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓ దశలో కొట్టుకునే పరిస్థితి ఏర్పడటంతో పోలీసులు, ఇరుపార్టీల ప్రతినిధులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఏదిఏమైన కాంగ్రెస్, బీఆర్ఎస్ ర్యాలీలు రాజకీయంగా పోటాపోటీగా సాగినా చివరకు ఘర్షణకు దారితీయకుండా ముగిశాయి. పోలీసుల ముందస్తు ప్రణాళిక, భారీ బందోబస్తు కీలకంగా నిలిచింది.


