● ఎగుమతి కేంద్రంగా జిల్లా
● బియ్యం, పెంబర్తి కళాఖండాలకు
మార్కెటింగ్కు చర్యలు
● హస్తకళకు కొత్త గుర్తింపు, కేంద్రం అండ
● సుగంధ బియ్యంతో
జనగామకు ప్రత్యేక బ్రాండ్
● భవిష్యత్లో పెరగనున్న ఉపాధి
అవకాశాలు
జనగామ: జిల్లా ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు కల్పించే దిశగా.. ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశాలు మెరుగవుతున్నా యి. జనగామ బియ్యం (సుగంధ/చిట్టి ముత్యాలు) ప్రత్యేక బ్రాండ్గా తీర్చిదిద్దడంతో పాటు ప్రా సెసింగ్, బ్రాండింగ్పై దృష్టి సారించనున్నారు. పెంబర్తి కళాఖండాలు, హస్తకళలకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించే చర్యలు ఊపందుకోనున్నాయి. ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’ ద్వారా రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలు, కళాకారులకు విస్తృత గిరాకీ లభించనుండగా, భవిష్యత్లో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.
‘సుగంధ బియ్యం’ ప్రత్యేక గుర్తింపు..
జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’ (ఓడీఓపీ) పథకంలో సుగంధ బియ్యం ‘చిట్టిముత్యాలు’ లేదా ఇతర బ్రాండ్ ఆధారిత ఉత్పత్తులను ప్రత్యేక ఉత్పత్తిగా గుర్తించింది. ఇందుకు సంబంధించిన రకానికి క్లారిటీ రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ జాబితాలో జనగామను ‘రైస్ బేస్డ్ ప్రొడక్టస్’ (సెంటెడ్ రైస్–చిట్టిముత్యాలు) కేటగిరీలో చేర్చారు. పథకం ఉద్దేశం ఒక జిల్లాలో ప్రత్యేకత కలిగిన ఉత్పత్తికి విలువ జోడింపు, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్ వంటి అంశాలను ప్రోత్సహించడం. వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాసెసింగ్ సదుపాయాలు, వృథాను తగ్గించడం, సరైన నిల్వ, మార్కెటింగ్ వ్యవస్థలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించనున్నారు. జిల్లాకు చిట్టిముత్యాలు బియ్యం ప్రత్యేక గుర్తింపు రావడంతో స్థానికంగా ఉత్పత్తి అయ్యే ధాన్యాన్ని కేవలం ముడి సరుకుగా విక్రయించకుండా బియ్యం, పిండి, ఇతర ఆహార ఉత్పత్తులుగా విలువ జోడించి మార్కెట్లోకి తీసుకెళ్లే అవకాశం ఏర్పడుతుంది. రైతులతో పాటు మహిళా సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సూక్ష్మ ఆహార పరిశ్రమలకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. జనగామకు చిట్టిముత్యాలు బియ్యం ఓడీఓపీ గుర్తింపు రావడం కేవలం పేరుకే పరిమితం కాకుండా, రైతు పండించిన ధాన్యానికి అదనపు విలువ కల్పించడం, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం, విస్తృత మార్కెట్కు తీసుకెళ్లడం జరిగితే జిల్లాలో వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
ఎగుమతి కేంద్రంగా..
జిల్లాల ప్రత్యేక ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానించి ఎగుమతులను ప్రోత్సహించాలనే కేంద్రం నిర్ణయంలో భాగంగా జిల్లాలోని పెంబర్తి లోహ కళాఖండాలకు మరోసారి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇందులో భాగంగా స్థానిక ఉత్పత్తులకు బ్రాండ్ గుర్తింపు కల్పించి అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానించనున్నారు. పెంబర్తి హస్తకళలకు గతంలోనే పర్యాటక కేంద్రంగా గుర్తింపు లభించగా, ప్రస్తుతం ఎగుమతుల ద్వారా మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఏర్పడింది. బిందెలు, కొప్పర్లు తయారు చేయడంతో ప్రారంభమైన ఈ కళ 1968లో విశ్వకర్మ సహకార సంఘం ఏర్పాటుతో మరింత విస్తరించింది. కాకతీయ కళా తోరణం తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో చోటు దక్కడంతో పెంబర్తి కళకు మరింత ఖ్యాతి వచ్చింది. ఎ గుమతులు పెరిగితే కళాకారులకు ఉపాధి, ఆదా యం పెరగడంతో పాటు స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.


