● బీసీ మహిళలకు 100శాతం సబ్సిడీతో కుట్టుమిషన్లు
● ఉపాధితో పాటు అర్థిక ఎదుగుదలే లక్ష్యం
● వితంతు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యం
● ఈనెల 15 వరకు దరఖాస్తులకు గడువు
జనగామ రూరల్: కుటుంబంలోని మహిళలకు ఉపాధి, ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉచితంగా ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకాన్ని ప్రకటించింది. మహిళా సాధికార త, ఆర్థికాభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి ద్వారా సంక్షేమ పథకాలు, అవకాశాలు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా 100 శాతం సబ్సిడీతో ఉచితంగా కుట్టు మిషన్ పథకాన్ని తీసుకొచ్చింది. అర్హులైన మహిళలకు రూ.12 వేల విలువైన కుట్ట మిషన్ల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. చాలా మంది మెప్మా, సెర్ప్ ద్వారా కుట్టు మిషన్లలో శిక్షణ పొంది జీవనోపాధి పొందుతున్నారు. ప్రతీ నియోజకవర్గానికి వెయ్యి కుట్టు మిషన్లు అందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
అభ్యర్థుల అర్హతలు
దరఖాస్తుదారులు బీసీ వర్గానికి చెందిన నిరుద్యోగ మహిళై ఉండాలి. నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, మేర/మేరు కమ్యూనిటీ మహిళలకు మొదటగా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదా యం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి ఆదాయ ధ్రువీకరణ పత్రం అందజేయాల్సి ఉంటుంది. కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు కన్వీనర్లుగా ఉండగా, దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హుల జాబితా జిల్లా స్థాయి కమిటీ ఆమోదం పొందిన అనంతరం మిషన్లు పంపిణీ చేస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
బీసీ మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఉచిత ఆటోమెటిక్ కుట్టుమిషన్లు అందించనుంది. అర్హులైన బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆన్లైన్లో ఈనెల 15 లోపు దరఖాస్తులు చేసుకోవాలి. అప్లికేషన్లు ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయాలి.
– ఎన్ఎల్ నర్సింహరావు,
బీసీ సంక్షేమాధికారి


