హన్మకొండ: గణపతి నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకులకు సూచించారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు, నిర్వహణపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ.. ఉత్సవ నిర్వాహకులు పోలీస్, అధికారుల సూచనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో, స్నేహపూర్వక వాతావరణంలో వేడుకలు నిర్వహించాలన్నారు. కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద, డీసీపీలు దార కవిత, అంకిత్కుమార్, రాజమహేంద్ర నాయక్, జనగామ అదనపు కలెక్టర్ బెన్ షాలోం పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై
అవగాహన ఉండాలి
జనగామ రూరల్: విద్యార్థులకు మత్తు పదార్థాలు అలాగే సైబర్ నేరాలపై తప్పనిసరిగా అవగాహన ఉండాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. బుధవారం మండలంలోని చౌడారం పీఎంశ్రీ మోడల్ పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వై.శ్రీహరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ.. విద్యార్థులు మత్తుకు బానిస కాకుండా ఉండాలని, ఉన్నత చదువులు చదివి ఎదగాలని తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని అన్నారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యాయులు ఉస్మాన్, సుధీర్, నరసయ్య, స్రవంతి, అనుపమ, విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి
సాంస్కృతిక పోటీలు
జనగామ: విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా ని ర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వీహెచ్పీ జిల్లా కార్యదర్శి మోహనకృష్ణ భార్గవ తెలిపా రు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు.. ఈ నెల 4వ తేదీన ఉదయం 10 గంటలకు హన్మకొండ రోడ్లోని శ్రీరాంనగర్ కాలనీ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జన్మాష్టమి సందర్భంగా సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలని, తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని మోహనకృష్ణ భార్గవ కోరారు.
హామీల అమలులో
కాంగ్రెస్ విఫలం: పల్లా
జనగామ: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ కార్డు ఇప్పుడు బాకీ కార్డుగా మారిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని తెలిపారు. సమావేశంలో కౌన్సిలర్లు, నాయకులు ఇర్రి రమణారెడ్డి, బాల్దె సిద్దిలింగం, గాడిపల్లి ప్రేమలతారెడ్డి, పోకల జమున, తాళ్ల సురేష్రెడ్డి, ముస్త్యాల దయాకర్, గోపగోని సుగుణాకర్ గౌడ్, సజ్జ దుర్గాప్రసాద్, ఎనగందుల కృష్ణ, సేవెల్లి మధు, పెద్ది రాజిరెడ్డి, అనిత, పేర్ని స్వరూప, సువార్త, మంజుల పాల్గొన్నారు.
చంద్రబాబుకు సీఎం రేవంత్ దాసోహం
తెలంగాణ నీటి ప్రయోజనాలను పక్కనపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సీఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి.. చంద్రబాబు నాయుడుకు దాసోహమయ్యారని విమర్శించారు. గోదావరి, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.


