కదిలిన యంత్రాంగం
● డ్రెయినేజీల దుస్థితిపై మున్సిపల్ చైర్మన్, అధికారుల దృష్టి
● కబ్జాలు, అక్రమ నిర్మాణాల
తొలగింపునకు కార్యాచరణ..?
జనగామ: పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తాలోని నాలుగు కూడళ్ల పరిధిలో డ్రెయినేజీల దుస్థితిపై ము న్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. హనుమకొండ, సూర్యాపేట, హైదరాబాద్, సిద్దిపేట రహదారుల వెంట డ్రెయినేజీలు కబ్జాలకు గురికావడం, మురుగునీరు సాఫీగా ముందుకు వెళ్లకపోవడం, డ్రెయినేజీలపై టాయిలెట్లు, వ్యాపార సంబంధిత నిర్మాణాలు చేపట్టడంతో ఏర్పడుతున్న సమస్యలను గురువారం మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, కమిషనర్ రాజశేఖర్రెడ్డి, కౌన్సిలర్లు చెంచారపు కరుణాకర్రెడ్డి, దోర్నాల అనిత, అండాలు తదితరులు గురువారం పరిశీలించారు. హనుమకొండ రోడ్డులో పలుచోట్ల డ్రెయినేజీలు ధ్వంసం చేసి వాటిపై నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. డ్రెయినేజీలు మట్టి పేరుకపోవడంతో మురుగునీరు ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. సిద్దిపేట రోడ్డులోనూ డ్రెయినేజీలపై వ్యాపార సంస్థల నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. చౌరస్తా ప్రధాన మలుపు వద్ద హోటళ్ల నిర్వాహకులు డ్రెయినేజీలపై టాయిలెట్లు, ఇతర నిర్మాణాలు చేపట్టిన విషయాన్ని పరిశీలించారు. వర్షాలతో నీరు నిలిచిపోవడంతో పాటు మురుగు నీరు రోడ్లపైకి చేరి ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని అధి కారులు గమనించారు. డ్రెయినేజీలపై ఉన్న నిర్మాణాలు, కబ్జాలను పూర్తిస్థాయిలో తొలగించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.
దోమల నివారణకు చర్యలు
మూడో వార్డుతో పాటు పట్టణంలోని ఆయా వార్డుల్లో దోమల నివారణకు స్ప్రేయింగ్ చేపడుతూ పారిశుద్ధ్యంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఈ నెల 2న ‘స్వచ్ఛతకు సవాల్’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు.


