జనగామ రూరల్: ఉద్యోగ, ఉపాధ్యాయుల, కార్మికుల, పెన్షనర్ల దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్ ఖాజా షరీఫ్ డిమాండ్ చేశారు. రాష్ట్రశాఖ పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని చౌరస్తా వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయులు మహా ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఖాజా షరీఫ్ మాట్లాడుతూ.. కాలపరిమితి దాటి 3 ఏళ్లు దాటినా న్యాయంగా ఉద్యోగులకు రావాల్సిన పీ ఆర్సీ అమలు చేయకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. 6 డీఏలు ఇవ్వకపోవడం, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా సీపీఎస్ రద్దు విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం సరికాదన్నారు. వెంటనే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యూనియన్ సెక్రటరీ కొర్నేలియస్ మాట్లాడుతూ.. ఉద్యోగుల పోరాటంతో ప్రభుత్వం వెంటనే స్పందించాలని లేదంటే సెప్టెంబర్ 10వ తేదీన పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి ధర్నా నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర బాధ్యులు రంజిత్ కుమార్, శ్రీనివాస్, కళావతి హాజరై మాట్లాడుతూ.. సమష్టి పోరాటాల ద్వారా మాత్రమే ఫలితాలు వస్తాయని, రైతుల ఉద్యమం, విద్యార్థుల ఉద్యమం ఫలితాలను ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని కోరారు. సమావేశంలో జిల్లా బాధ్యులు మహిపాల్ రెడ్డి, చంద్రశేఖర్రావు, పెండెల శ్రీనివాస్, రాజు, లక్ష్మణ మూర్తి, షరీఫ్, రామస్వామి, శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, హఫీజ్, లావణ్య, అరుణ, యశో ద, లక్ష్మి, శారదా, భాగ్య తదితరులు పాల్గొన్నారు.
పీఆర్సీ, డీఏలను వెంటనే ప్రకటించాలి
ఉద్యోగ, ఉపాధ్యాయుల
మహాధర్నాలో వక్తలు


