జనగామ: జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీ కోసం సమీకృత కలెక్టర్ కార్యాలయ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో ఆదివారం రాత పరీక్ష నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖలో ఒక కుక్, మూడు కామాటి, షెడ్యూల్డ్ కులాల సర్వీస్ కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ సొసైటీ లిమిటెడ్లో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఒక ఆఫీస్ సబార్డినేట్, వ్యవసాయ మార్కెట్ కమిటీలో 2 డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 2 సెక్యూరిటీ గార్డులు, 1 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్కు మొత్తం 575 దరఖాస్తులు రాగా, అందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు (371), ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు (146), కుక్, కామాటి పోస్టులకు (50), సెక్యూరిటీ గార్డు పోస్టులకు (8) దరఖాస్తులు వచ్చాయి.
పరీక్షకు 480 మంది హాజరు
రాత పరీక్షకు 480 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు 309 మంది, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు 118 మంది, సెక్యూరిటీ గార్డు పోస్టులకు 7 మంది, కుక్ పోస్టుకు 24 మంది, కామాటి పోస్టుకు (22) మంది పరీక్ష రాశారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించిన రాత పరీక్షను రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షించారు. ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పర్యవేక్షించిన కలెక్టర్
సందీప్ కుమార్ ఝా


