జనగామ: పట్టణంలో భవన నిర్మాణ అనుమతుల ప్రకారం వాహనాల పార్కింగ్ కోసం కేటాయించిన సెల్లార్లను ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న భవనాలపై పురపాలక సంఘం ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ప్రమాదకరంగా మారిన సెల్లార్లపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు ప్రచురితం చేయగా, అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, స్పెషల్ టీం అధికారులు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన భవనాల సెల్లార్లను గుర్తించి భవన యజమానులకు నోటీసులు జారీ చేసి 14 సెల్లార్లను సీజ్ చేశారు. ఇప్పటి వరకు 22 సెల్లార్లు సీజ్ చేయగా, మరో 8 వరకు మిగిలి ఉన్నాయని, వాటిని కూడా మూసివేయిస్తామని కమిషనర్ తెలిపారు. భవన యజమానులు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించి సెల్లార్లను పార్కింగ్కే వినియోగించాలన్నారు. తనిఖీల్లో కమిషనర్తో పా టు అగ్నిమాపక శాఖ ఇన్చార్జ్ ఫైర్ ఆఫీసర్ బి.జగదీశ్వర్, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారి పవన్ కుమార్, ఆర్ఐలు, వార్డు అధికారులు పాల్గొన్నారు.
భవన పన్ను ఎగవేతపై చర్యలు
పట్టణంలోని బాలాజీనగర్ ప్రాంతంలో కెనరా బ్యాంకు, డీసీసీ బ్యాంకు, కార్పొరేట్ కళాశాల హాస్టల్కు అద్దెకు ఇచ్చిన భవనానికి సంబంధించిన నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు. పురపాలక కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా భవనానికి వా ర్షికంగా సుమారు రూ.1.20 లక్షల ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉండగా, రూ.40 వేల మాత్రమే చెల్లిస్తున్నట్లు గుర్తించడం జరిగిందని కమిషనర్ రాజశేఖర్రెడ్డి తెలిపారు. విచారణ అనంతరం పన్ను రీ–అసెస్మెంట్తో పాటు జరిమానా కలిపి మొత్తం రూ.6.36 లక్షలు చెల్లించాల్సి ఉందని తేలింది. భవన యజమాని రామ్మోహన్రెడ్డి నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేసినట్లు కమిషనర్ తెలిపారు.
ఇప్పటివరకు 22 సీజ్
పార్కింగ్ స్థలాలను వాణిజ్య
అవసరాలకు వాడొద్దు : కమిషనర్


