జనగామ రూరల్: చట్టాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె.సందీప అన్నారు. బుధవారం జిల్లా న్యాయసేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా యాంటీ ర్యాగింగ్, చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ 2012, డ్రగ్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుపైనే ఎక్కువ శ్రద్ధ చూపాలని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం.రవీంద్ర, సోషల్ వేల్ఫేర్ పాఠశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్రావు, పి.జితేంద్ర, పారాలీగల్ వలంటీర్లు శేఖర్, రవికిరణ్ పాల్గొన్నారు.
సర్పంచ్ల ఫోరం
జిల్లా అధ్యక్షుడిగా శ్రీధర్గౌడ్
నర్మెట: సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా నర్మెట సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా హైదరాబాద్లోని పంచాయత్రాజ్ చాంబర్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ.. తన పై నమ్మకంతో అప్పగించిన పదవికి న్యాయం చేస్తానన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ, రాష్ట్ర కార్యదర్శులు సంపత్ నాయక్, వెంకట్, సర్పంచ్లు బానోత్ మహేందర్, కొర్ర రాజేందర్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ–కేవైసీ తప్పనిసరి
జనగామ రూరల్: రేషన్ కార్డుదారులందరికీ ఈ–కేవైసీ తప్పనిసరి అని, రేషన్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండటానికి వెంటనే పూర్తి చేసుకోవాలని బుధవారం కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఒక ప్రకటనలో సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జాతీయ ఆహార భద్రతా చట్టం, రాష్ట్ర ఆహార భద్రతా కార్డుల కింద నమోదైన లబ్ధిదారులకు ఈ–కేవైసీ సరిచూడటం తప్పనిసరి చేసినట్టు తెలి పారు. లబ్ధిదారులు తమ సమీపంలోని చౌకధరల దుకాణానికి వెళ్లి ఈ–కేవైసీ చేసుకోవాలని, ఏ విధమైన రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. లబ్ధిదారులు వ్యక్తిగతంగా తమ వేలిముద్రలను వేయాలని ఈనెల 31 లోగా ఈ–కేవైసీ పూర్తి చేయకపోతే వారి యూనిట్ తొలగించబడుతుందన్నారు.
మల్లన్నగండిలో మొసళ్లు
నర్మెట: మల్లన్నగండి రిజర్వాయర్.. గోదావరి జలాలతో రెండు గుట్టల నడుమ పచ్చనిచెట్లు, జలపాతం, ఘాట్రోడ్డుతో మనసు దోచే అహ్లాదకరమైన ప్రదేశం. నర్మెట, తరిగొప్పుల, చిల్పూర్, స్టేషన్ ఘన్పూర్ మండలాలతో పాటు జిల్లా కేంద్రం వాసులకు పర్యాటక ప్రదేశంగా రోజరోజుకూ పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. పది రోజులుగా ధర్మసాగర్ నుంచి మోటార్ల ద్వారా నీరు చేరుతుండటంతో నిండుకుండలా మారుతోంది. కాగా, గోదావరి జలా లతో పాటు రిజర్వాయర్లోకి వచ్చిన మొసలి పిల్లలు పెద్దవి అయ్యాయి. ఈక్రమంలో ఇవి రిజర్వాయర్ ఒడ్డుకు వస్తున్నాయి. పర్యాటకులు నీటి అంచుల వరకు వెళ్లి విందులు, వినోదాల్లో మునిగిపోతున్నారు. ఈనేపథ్యంలో ప్రమాదం పొంచి ఉన్నందున అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
శివునిపల్లి ఆగ్రోస్ సెంటర్కు స్టాప్సేల్ నోటీసు
స్టేషన్ఘన్పూర్: మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి ఆగ్రోస్ సేవా కేంద్రానికి స్టాప్ సేల్(అమ్మకాల నిలిపివేత) నోటీసును జారీ చేసినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్.కరుణాకర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. శివునిపల్లి ఆగ్రోస్ సెంటర్ నిర్వాహకుడు రైతులకు పారదర్శకంగా ఎరువులను పంపిణీ చేయకుండా అతడికి అనువుగా ఉండేవారికే ఎరువులను అందిస్తున్నాడని తమ విచా రణలో తేలిందన్నారు. దీంతో స్టాప్ సేల్ నోటీ సు జారీ చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు.


