● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ: ప్రజల ఆరోగ్య రక్షణలో ఫార్మసీల బాధ్యత కీలకమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో చివరి రోజున డ్రగ్స్ కంట్రోల్ అండ్ రెగ్యులేటరీ డేను కలెక్టరేట్ సమావేశం హాల్లో శనివారం నిర్వహించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్లతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం ప్రతీ మెడికల్ షాప్ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్, లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. మున్సిపల్ నిబంధనల విషయానికొస్తే, మెడికల్ షాపులు నివాస భవనాల్లో కాకుండా వాణిజ్య భవనాల్లోనే నడపాలని సూచించారు. ఔషధాల విక్రయంలో జాగ్రత్తలు పాటించాలని, ప్రిస్క్రిప్షన్ మందులు వైద్యుల చీటి లేకుండా ఇవ్వకూడదని, అదే విధంగా జిరాక్స్ కాపీలు, వాట్సాప్ ద్వారా వచ్చిన ప్రిస్క్రిప్షన్ల ఆధారంగా మందులు ఇవ్వరాదని, ఒరిజినల్ ప్రిస్క్రిప్షన్ మాత్రమే పరిగణించాలన్నారు.
డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన ర్యాలీ
డ్రగ్స్ మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో కలెక్టర్ పాల్గొని ప్రారంభించారు. నెహ్రూపార్కు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. డ్రగ్స్ దుర్వినియోగంపై అప్రమత్తత అవసరమన్నారు. ఎక్కడైనా డ్రగ్స్ దుర్వినియోగం కనిపించినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1800 599 6969కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. అనంతరం ఫార్మసీ విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి ప్రశంస పత్రాలు అందించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.


