50 బెడ్లతో క్రిటికల్ కేర్
గ్రౌండ్ ఫ్లోర్లో...
జనగామ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి పరిధిలో చంపక్హిల్స్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ విభాగం త్వరలో ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందించడానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఆమోదించిన ఈ ప్రత్యేక విభాగం జిల్లా ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన సంరక్షణ అందించడమే ముఖ్య ఉద్దేశం. అత్యవసర ఆరోగ్య పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే సేవలను మరింత బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న క్రిటికల్ కేర్ భవనంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ), హైడిపెండెన్సీ యూనిట్ (హెచ్డీయూ), ఐసోలేషన్ వార్డులు, మేజర్ ఆపరేషన్ థియేటర్లు, డయాలిసిస్ యూనిట్, మెటర్నిటీ క్రిటికల్ కేర్, సీటీ స్కాన్, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఈఎండీ వార్డు వంటి విభాగాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి అత్యవసర వైద్యసేవలు, ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులకు 24 గంటల పర్యవేక్షణ, అత్యున్నత స్థాయి చికిత్సలు అందించేలా రూపుదిద్దుకుంటున్నాయి.
వెంటిలేటర్ సపోర్ట్, కార్డియాక్ మానిటరింగ్, సెప్సిస్ (ఇన్ఫెక్షన్లకు శరీరం చూపే అతి తీవ్రమైన ప్రతిస్పందన), స్ట్రోక్, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి తక్షణ శస్త్రచికిత్స, నిరంతర పర్యవేక్షణ వంటి సేవలు ఈ ఐసీయూలో అందుబాటులో ఉంటాయి. హెచ్డీయూ యూనిట్లో ఐసీయూ నుంచి కోలుకుంటున్న లేదా అత్యవసర పరిస్థితికి దగ్గరలో ఉన్న రోగులకు మధ్యస్థ సంరక్షణను అందించడానికి ఉపయోగపడుతుంది. కాగా ఐసోలేషన్ వార్డులు వైరల్, ఎపిడెమిక్ వ్యాధుల బారినపడిన రోగులను వేరుగా ఉంచి చికిత్స చేయడానికి ముఖ్యపాత్ర పోషిస్తాయి. క్రిటికల్ డెలివరీ కేసులకు మెటర్నిటీ క్రిటికల్ యూనిట్ ఉపయోగకరంగా ఉంటుంది.
సీటీస్కాన్, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ వంటి ఆధునిక నిర్ధారణ పరికరాలు ఉండటం వల్ల అత్యవసర కేసులను తక్షణమే గుర్తించి చికిత్స ప్రారంభించే అవకాశం కలుగుతుంది. ప్రమాదాలు, గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోక్లు, విషతుల్యత్వం, భారీ రక్తస్రావం వంటి పరిస్థితుల్లో ఈ విభాగం ప్రాణరక్షణకు కీలకంగా నిలుస్తుంది. జిల్లా ప్రజలకు అత్యవసర వైద్య సేవల నాణ్యత పెంచడమే కాకుండా, హనుమకొండ, హైదరాబాద్ వంటి దూరప్రాంతాలకు వెళ్లకుండా జిల్లా కేంద్రంలోనే ఉన్నతస్థాయి చికిత్స అందించడంలో క్రిటికల్ కేర్ విభాగం కీలక పాత్ర పోషించనుంది. ఈ విభాగం పూర్తిస్థాయిలో అందుబాటు లోకి వస్తే జిల్లా ఆరోగ్య వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.
జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అనుబంధంగా నిర్మించిన క్రిటికల్ కేర్ భవనం పూర్తై నెల రోజులైనా ప్రారంభానికి నోచుకోవడం లేదు. చంపక్హిల్స్ ప్రాంతం కొండల ప్రదేశం కావడంతో అక్కడ వేసిన బోర్లు వెయ్యి అడుగుల లోతు దాటినా నీరు రాకపోవడం పెద్ద సమస్యగా మారింది. భవనం పూర్తిస్థాయిలో ప్రారంభమైతే నీటి కొరత తీవ్రంగా తలెత్తే అవకాశం ఉండడంతో ఆసుపత్రి వర్గాలు.. కాంట్రాక్టర్ నుంచి భవనాన్ని స్వాధీనం చేసుకోవడం లేదు. క్రిటికల్ కేర్కు నీటి సమస్యపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం ఆధ్వర్యంలో కలెక్టర్కు రిప్రజెంటేషన్ అందించారు. నీటి సమస్య పరిష్కారంపై అధికార యంత్రాంగం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నీటి వనరులపై స్పష్టత రాకపోవడంతో క్రిటికల్ కేర్ భవనం స్వాధీనం చేసుకోవడంలో వాయిదా పడుతోంది. నీటి సమస్యకు పరిష్కారం చూపే వరకు భవనం బాధ్యతలు స్వీకరించేందుకు వారు ముందుకు రావడం లేదు.
ఎంసీహెచ్ ఆవరణలో 50 పడకల క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్ నిర్మాణం పూర్తయింది. మొత్తం రూ.23.75 కోట్లు వ్యయంతో నిర్మాణం చేపట్టారు. 22 ఎకరాల విస్తీర్ణంలో రెండు అంతస్థుల నిర్మాణం చేపట్టారు. భవన ప్రదేశం 42,691 చదరపు అడుగులు ఉండగా, ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ 24,541 చదరపు అడుగులు, మొదటి అంతస్థు 18,150 చదరపు అడుగుల వైశాల్యంలో ఉంది. మే 2023లో ప్రారంభమైన క్రిటికల్ కేర్ భవన నిర్మాణం మార్చి 2025లో పూర్తి చేశారు.
ఆపరేషన్ థియేటర్లు: 2
ఐసోలేషన్ రూములు: 2
ఎగ్జామినేషన్ రూం
డయాలిసిస్ రూం
మెటర్నిటీ వార్డు
ఎల్డీఆర్
ఈఎండీ వార్డు
సీటీ స్కాన్
ఎక్స్–రే
అబ్జర్వేషన్ రూమ్
అల్ట్రాసౌండ్
ఫస్ట్ ఫ్లోర్:
ఐసోలేషన్ వార్డులు:6
ఐసీయూ
హెచ్డీయూ
వెయ్యి అడుగుల లోతు బోరు వేసినా
కనిపించని చుక్కనీరు
నీటివనరులపై రాని స్పష్టత
కలెక్టర్కు నివేదించిన జిల్లా వైద్యశాఖ అధికారులు


