జఫర్గఢ్: గురుకులాల్లో విద్యార్థులు నిత్యం చిన్నచిన్న సమస్యలతో ఆందోళనకు గురై మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. సమస్యను బైటకు చెప్పుకోలేక లోలోన ఇబ్బందులు పడుతుండడం వల్ల చదువులపై ప్రభావాన్ని చూపుతున్నది. దీన్నించి విద్యార్థులు బైటపడేందుకుగాను ప్రభుత్వం గురుకులాల్లో నూతనంగా ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేవారు. ప్రతీ పాఠశాలలో ప్రతీ శుక్రవారం తెరువాల్సిన విద్యార్థుల ఫిర్యాదుల పెట్టెను జఫర్గఢ్ గురుకుల పాఠశాలలో మాత్రం ప్రతీరోజు తెరిచి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపుతూ ఇతర గురుకులాలకు అదర్శంగా నిలుస్తున్నది. మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్మిడియట్ వరకు 600 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. చదువుల విషయంలోగాని, భోజన నాణ్యతలోగాని, తోటి విద్యార్థుల మధ్య ఏర్పడే సమస్యల పరిష్కారం కోసం వీరు తమ సమస్యలను రాసి ఫిర్యాదు బాక్స్లో వేయాల్సి ఉంటుంది. కాగా ఈ పెట్టెను వారం రోజులకు ఒకసారి తెరిచి బాక్స్లో పడిన ఫిర్యాదులను పరిశీలించి వాటి పరిష్కారానికి మార్గం చూపాలి. కానీ ఈ గురుకుల పాఠశాలలో మాత్రం పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్.వరలక్ష్మి ప్రత్యేకంగా ప్రతీ రోజు ఫిర్యాదుల పెట్టేను తెరిచి సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు.
జఫర్గఢ్ గురుకుల పాఠశాలలో సరికొత్త ఒరవడి


