వానకొండ.. అభివృద్ధి వెక్కిరింత
దేవరుప్పుల: హోలీ పర్వదినం పురస్కరించుకుని ఉగాది వరకు శ్రీ వానకొండ లక్ష్మీనర్సింహ్మస్వామి జాతర వైభవంగా కొనసాగనుంది. ఈనెల 3 (మంగళవారం) నుంచి జాతర ప్రారంభం కానుంది. జాతరకు ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలకు చెందిన భక్తులు భారీగా తరలివస్తారు. ప్రధానంగా గిరిజనులు కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
గ్రహణంతో ఆర్భాటాలకు స్వస్తి
ఈసారి శ్రీ లక్ష్మీనర్సింహ్మస్వామి కల్యాణోత్సవం రోజు గ్రహణం ఉండడంతో వేదబ్రహ్మణుల సూచన మేరకు గుట్ట పూజారి బీట్కూరి సంపత్కుమారచార్యులు ఆర్భాటాలకు తావివ్వకుండా ఉదయం 10 లోపు కల్యాణం ముగిసేలా నిర్ణయించారు. దీంతో కడవెండి నుంచి తలంబ్రాలు, చేనేత వస్త్రాలు నేరుగా గుట్టవద్దకు చేరడంతో ఉత్సవాల ప్రారంభానికి సన్నాహాకాలు చేస్తున్నారు.
అభివృద్ధి జాడేది..?
నూటయాభై ఏళ్ల నుంచి కొనసాగుతున్న వానకొండ లక్ష్మీనర్సింహ్మస్వామి జాతర అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేదనే విమర్శలు ఉన్నాయి. ఎన్ని పాలకవర్గాలు వచ్చినా అభివృద్ధి అంతంతే. ఐదు దశాబ్దాల కిందట సాదాసీదా వసతులతో కొనసాగిన జాతరకు ఆపై కడవెండి గ్రామస్థుల ప్రత్యేక వసతులపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం పక్షాన తాగునీటి, విద్యుత్ వంటి సౌకర్యాలు ఏర్పర్చారు. భక్తులు కాలినడకన ఇబ్బందులు పడుతున్నారని 12 ఏళ్ల కింద గుట్టపైకి మెట్లు నిర్మించారు. ముఖద్వారం, పైన రేకులషెడ్ల వసతులు వంటివి దాతలు సమకూర్చారు. ఈ నేపథ్యంలోనే 2023 జూలై 7 వ తేదీన అప్పటి పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎంఎంఆర్ గ్రాంట్ కింద రూ.2.50 కోట్లతో గుట్టపైకి ఘాట్రోడ్డు, సీఎం అదనపు నిధుల కింద రూ. కోటితో త్రితల విమాన గోపురం, మండపం నిర్మాణం కోసం శిలాఫలకాలు వేశారు. గత అసెంబ్లీ నాటికి గుట్టపైకి సదరు కాంట్రాక్టర్ ఘాట్ రోడ్డుకోసం చదును చేసి చేతులెత్తేశారు. ప్రస్తుత పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి గతేడాది జాతరకు వచ్చి నిధుల రీమంజూరుతో మిగులు పనులు చేయిస్తానన్న హామీ ఇవ్వగా ఆచరణలోకి రాలేదు.
జాతర ఉత్సవ కమిటీ నియామకం
శ్రీ వానకొండ లక్ష్మీనర్సింహ్మస్వామి జాతర పురస్కరించుకొని ఉత్సవ నిర్వహణ కోసం దేవాదాయశాఖ పక్షాన తాత్కాలిక ఆలయ కమిటీని నియమించినట్టు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్గా మాసంపెల్లి భాస్కర్, వైస్ చైర్మన్గా కాడవేని శ్రీనివాస్, జనరల్ సెక్రటరీలుగా పాముకుంట్ల చొక్కయ్య, సంపంగి యాకరాజు, కోశాధికారిగా భాషిపాక పరుశరాములు, కార్యవర్గ సభ్యులుగా మూడ నర్సింహ్మ, మైనాల రమేష్, రంపీస శ్రీనివాస్, మేడబోయిన మహేశ్, కాడవేని కుమార్, బోసు కనకయ్య, కొండయ్య, యాదయ్య, యాకయ్యను నియమించినట్టు పేర్కొన్నారు.
శిలాఫలకాలతో సరి..కానరాని పురోగతి
ఎన్ని పాలకవర్గాలు వచ్చినా
అభివృద్ధి శూన్యం
రేపటి నుంచి శ్రీ వానకొండ
లక్ష్మీనర్సింహ్మస్వామి జాతర
వానకొండ.. అభివృద్ధి వెక్కిరింత
వానకొండ.. అభివృద్ధి వెక్కిరింత


