3న సోమన్న ఆలయం మూసివేత
పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవాలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా ఈనెల 3 (మంగళవారం)న ఉదయం 8 గంటలకు ఆలయం మూసివేయనున్నట్లు (ద్వారబంధనం) ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, ప్రధాన అర్చకుడు దేవగిరి లక్ష్మన్న శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరిగి 4వ తేదీ బుధవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం స్వామివారి దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు, భక్తులు సహకరించాలని కోరారు.
పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి
జనగామ రూరల్: పాడి పరిశ్రమ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్లో మేనేజింగ్ డైరెక్టర్ కె.చంద్రశేఖర్రెడ్డి, విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.గోపాల్ సింగ్లను జిల్లా నాయకులు శనివారం కలిశారు. ప్రస్తుతం ఉన్న పాల సేకరణ ధరలను పెంచి, ఎస్ఎన్ఎఫ్ తగ్గించాలను తొలగించాలని కోరారు. పాడి రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంతరం చైర్మన్ అమిత్ రెడ్డి మాట్లాడుతూ విజయ డెయిరీ ప్రతీ రోజు మూడు లక్ష్యల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరిస్తున్నామని, త్వరలోనే పాల కొనుగోలు ధరలను పెంచతామన్నారు. డైరెక్టర్ కె.చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ పాడి రైతులు ప్రైవేట్ డెయిరీలను నమ్మి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ మధుసూదన్, పాడి రైతులు పి.జోగారెడ్డి, స్వామి, సాదం రమేష్, శ్రీనివాస్, మేనేజర్ నరేష్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
క్షణికావేశం..
తొందరపాటు నిర్ణయం
● పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
● రోడ్డుపాలైన కుటుంబం
లింగాలఘణపురం: తండ్రి క్షణికావేశం..తొందరపాటు నిర్ణయంతో చిన్నారులు తండ్రిలేని పిల్లలయ్యారు. అల్లారుముద్దుగా అమ్మానాన్నల ఆలనాపాలనలో పెరగాల్సిన చిన్నారులకు తండ్రిలేని లోటు తీర్చేదెవరూ? చనిపోవాలనుకొనే క్షణంలో ఒక్కసారి తన గుండెలపై తన్నుకుంటూ ఆడుకునే ఆ చిన్నారులు గుర్తుకు రాలేదా..అంటూ రోదిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు ప్రతీఒక్కరి కంట కన్నీరు కార్చిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామస్తులు, విశ్వసనీయ సమాచారం మేరకు.. మండలంలోని గుమ్మడవెల్లికి చెందిన వేల్పుల అనిల్కుమార్ (28) అతని భార్య సంతోషి మధ్య ఫిబ్రవరి 26న స్వల్ప గొడవ జరిగింది. దీంతో క్షణికావేశంలో అదేరోజున అనిల్కుమార్ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు జనగామకు అక్కడి నుంచి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. అనిల్కుమార్కు నాలుగేళ్ల విఘ్నేష్, రెండున్నరేళ్ల పాప ఉంది. నాన్న..నాన్న అంటూ చిన్నారులు ఏడుస్తున్న తీరు ప్రతీఒక్కరి గుండెను కదిలించింది. తల్లిదండ్రుల గొడవలతో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో అభంశుభం తెలియని పిల్లలు తండ్రిలేని వారయ్యారు.
సౌత్జోన్ టోర్నమెంట్కు కేయూ జట్టు
కేయూ క్యాంపస్: తమిళనాడులోని తిరుచారపల్లిలోని భారతీదాస్ యూనివర్సిటీలో మార్చి 2, 3 తేదీల్లో నిర్వహించనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ చెస్ టోర్నమెంట్కు కేయూ పురుషుల జట్టు పాల్గొననున్నట్లు శనివారం కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య తెలిపారు. ఈజట్టులో పి.శ్రీచైతన్య , ఎస్.శివసాత్విక్, ఎస్.సంజయ్చంద్ర, బి.రాకేశ్, కె.సచిన్, జె.శివకుమార్తో పాటు మాస్టర్జీ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కె.నరేందర్ కోచ్ కమ్ మేనేజర్గా వ్యవహరించనున్నట్లు వెంకయ్య తెలిపారు.
3న సోమన్న ఆలయం మూసివేత


