ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులను అరికట్టాలి
జనగామ: ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్యులు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను తక్షణమే అరికట్టాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జనగామ శాఖ ఆధ్వర్యంలో శనివారం డీసీపీ రాజమహేంద్రనాయక్కు వినతి చేశారు. అనంతరం జిల్లా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జె.బాలాజీ, కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ హైదరాబాద్ బండ్లగూడ జాగీర్, రాజేంద్రనగర్లోని ఆస్పత్రుల్లో చోటుచేసుకున్న దాడులు వైద్యుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయన్నారు. ప్రజలకు నిరంతర వైద్యసేవలు అందించడంలో అంతరాయం కలిగిస్తున్నారన్నారు. ఇలాంటి దాడులు వైద్యుల ప్రాణాలకు ముప్పు కలిగించడమే కాకుండా, అత్య వసర వైద్యసేవలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నారు. వైద్యులు, వైద్య సిబ్బందిపై, మెడికల్ సంస్థలపై దాడుల విషయంలో తెలంగాణ మెడికల్ సర్వీస్ పర్సనల్ అండ్ మెడికల్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, దాడులకు పాల్పడిన నిందితులపై చట్టప్రకారం శిక్ష విధించేలా కఠిన చర్యలు తీసుకునే విధంగా పోలీసు శాఖ హామీ ఇవ్వాలన్నారు. వారి వెంట మాజీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డి.లవకుమార్ రెడ్డి, వైద్యులు లక్ష్మీనారాయణ నాయక్, రంజిత్ కుమార్, స్వప్న రాథోడ్, విఘ్నశ్రీ తదితరులు పాల్గొన్నారు.


