పట్టణాభివృద్ధే ముఖ్యం
● నిధుల కోసం ఎక్కడికై నా వెళదాం..
● మున్సిపల్ మొదటి సాధారణ
సమావేశంలో ఎమ్మెల్యే పల్లా
జనగామ: ‘పట్టణ అభివృద్ధి కోసం ఎంత తగ్గాలో అంత తగ్గుతా..నిధుల కోసం ఎక్కడికై నా వెళదాం..నా వంతు సహకారం ఉంటుంది..’అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ సమావేశం హాలులో నూతన పాలక మండలి మొదటి సాధారణ సమావేశం చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ అధ్యక్షతన జరగగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి హాజరై మా ట్లాడారు.. పార్టీలకతీతంగా పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని పాలక మండలికి పిలుపునిచ్చారు.
సమస్యలు విన్నవించిన సభ్యులు
మున్సిపల్ సాధారణ సమావేశంలో సభ్యులు తమ వార్డుల్లో ఉన్న సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. జనగామ అభివృద్ధి సంపూర్ణ సహకారం అందిస్తామని వైస్ చైర్మన్ భూష పర్వతాలు అన్నారు. 30 వార్డుల్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ముందుగా గుర్తించి, ప్రియార్టీ ప్రకారం అభివృద్ధి చేసుకుంటే ఐదేళ్లలో జనగామ సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుందని సభ్యులు కోరారు.
ఓటింగ్ రోజు తప్పు చేశా.. క్షమించు తల్లీ
‘చెర్మన్ ఓటింగ్ రోజు జరిగిన ఎన్నికల్లో పొరపాటు జరిగింది.. మహిళలను గౌరవించడంలో ముందుంటా, తప్పు జరిగింది, పొరపాటుకు చింతిస్తున్నా, నీ కొడుకు లాంటి వాడిని, పెద్ద మనసు చేసుకుని క్షమించాలి’ అని 8వ వార్డు సభ్యురాలు మంజులను 15వ వార్డు సభ్యుడు పాండు కోరారు.
సభ్యులకు సత్కారం
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి చైర్పర్సన్ బాలమణి, వైస్చైర్మన్ పర్వతాలను శాలువాతో సత్కరించి శుబాకాంక్షలు తెలుపగా, మిగతా 28 మంది వార్డు సభ్యులు అభినందలు తెలిపారు. కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఉన్నారు.14, 17, 27, 29 వార్డుల సభ్యులు సాధారణ సమావేశానికి హాజరు కాలేదు.


