పైసామే పురమాత్మ!
ఓట్ల లెక్కలు తేల్చనున్న నోట్లకట్టలు?
జనగామలో 30, స్టేషన్ ఘన్పూర్లో 18 మొత్తంగా 48 వార్డుల్లో 209 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. స్వతంత్రులు అనేక చోట్ల ప్రధాన పార్టీల కు గట్టిపోటీ ఇవ్వగా, వీరికిపడే ఓట్లు ఎవరిని దెబ్బతీస్తాయోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చైర్మన్, వైస్ చైర్మన్ రేస్లో ఉన్నవారు భారీగా ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఉద యం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి అన్ని పార్టీల నాయకులు ఓటర్లను మేనేజ్ చేయడంలో నిమగ్నమైపోయారు. ఇంటెలిజెన్స్ అంచనాలు, రాజకీయ విశ్లేషకుల రిపోర్టులు, గెలుపు, ఓటమి లెక్కలు, డబ్బుల పంపిణీతో తారుమారైనట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
జనగామ: జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ ఎన్నికల్లో పంచిన డబ్బులు అభ్యర్థుల రాజకీయ లెక్కలను పూర్తిగా తారుమారు చేస్తున్నాయి. ఒక్కో ఇంటికి పది, పదిహేను కాదు.. కొన్నిచోట్ల యాభై వేల వరకు చేరి.. చివరకు ఓట్ల పంపకాలపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చింది. ఏ పార్టీ ఇచ్చినా తీసుకున్న ఓటర్లు, పోలింగ్ రోజున మాత్రం నిశ్శబ్దంగా బూత్కి వెళ్లి ఓటు వేశారు. ఎవరి వైపు మొగ్గు చూపారో.. ఎవరికీ వేశారో అభ్యర్థులు కూడా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ఇంటెలిజెన్స్ రిపోర్టులు, పార్టీల లెక్కలు, రాజకీయ విశ్లేషణలు అన్నీ డబ్బు ట్రెండ్తో తారుమారయ్యాయి. చివరికి డబ్బులు ఇచ్చిన వారు గెలుస్తారా లేక డబ్బులు తీసుకున్న ఓటర్లు గేమ్ మార్చారా అన్నది రేపటి ఫలితాలే చెప్పాలి. పురపాలక ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా జిల్లాలోని రెండు మున్సిపాలిటీల పరిధిలో డబ్బు దందా అమాంతం పెరిగింది. ఓటుకు నోటు లెక్క రాజకీయం మారడంతో ఓటర్ల ఇళ్ల వద్దే వేల రూపాయల నుంచి లక్ష దాకా డబ్బులు పంపిణీ చేశారు. గతంలో ఊహించని విధంగా ఓటర్లకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు, కొన్ని చోట్ల రూ.50 వేల రూపాయల వరకు అభ్యర్థులు ఖర్చు పెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఎక్కడ చూసినా ‘మనీ మోటివేషన్’ స్పష్టంగా కనబడగా, డబ్బులు ఇచ్చిన అభ్యర్థులే ఇప్పుడు ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది.
ఓటుకు నోటు..
జనగామ పట్టణంలోని కొన్ని వార్డుల్లో ఓటుకు రూ.10 వేల వరకు ఇవ్వగా, మరికొన్ని చోట్ల రూ.3వేల రూ.5 వేలకు పైగా పంపిణీ చేశారు. పోలింగ్ రోజు తెల్లవారుజాము వరకూ కూడా డబ్బుల పంపిణీ సాగింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లకు బస్సు ఛార్జీలు, భోజన ఖర్చులు, అదనంగా ఓటుకు నోటు అంటూ వేల రూపాయలు అందించిన ఘటనలు కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు పట్టుచీరలు, చికెన్ ప్యాకెట్లు, మద్యం, సిల్వర్ కాయినన్స్, స్వీట్ బాక్స్లు వంటి తాయిలాలు పంపిణీ చేశారు. బూత్ ల వద్ద కూడా అభ్యర్థుల అనుచరులు డబ్బుతో రెడీగా ఉండి అప్పటికప్పుడు ఓటును తమవైపు తిప్పుకునే దృశ్యాలు ఎక్కడ చూసినా కనిపించాయి.
సైలెంట్ ఓటింగ్...అభ్యర్థుల్లో ఆందోళన
డబ్బు పంపిణీకి ముందు ఉన్న అంచనాలన్నీ డబ్బులు ఇచ్చిన తర్వాత మారిపోయినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓటర్లు ఇంత పెద్దఎత్తున డబ్బులు తీసుకున్న తర్వాత ఏ పార్టీ వైపు మొగ్గుచూపారో చివరి నిమిషం వరకు చెప్పకుండా సైలెంట్గా వ్యవహరించడం అభ్యర్థుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. గత ఎన్నికల్లో ఓటర్లు బయటే బాహాటంగా చెప్పినప్పటికీ, ఈసారి పూర్తిగా నిశ్శబ్దంగా ఓటింగ్ చేయడం అభ్యర్థుల వారీగా ఓట్లు విభజనకు గురయ్యాయా అనే ఊహాగానాలు వినిపించాయి.
పోలింగ్కు ఒక రోజు ముందు రాత్రి నుంచి ప్రారంభమైన డబ్బుల పంపిణీ తెల్లవారుజాము వరకు పలు వార్డుల్లో కొనసాగగా, కొన్ని చోట్ల పోలింగ్ రోజున సాయంత్రం వరకూ రహస్యంగా నోట్ల పంపిణీ జరిగింది. దీంతో అభ్యర్థులు పగలు, రాత్రి తేడా లేకుండా పోల్ మేనేజ్మెంట్లోనే నిమగ్నమయ్యారు.
బూత్ల వద్దే పంపకాలు
ఇంటికి రూ.2వేల నుంచి 10వేలు..
చైర్మన్, వైస్ చైర్మన్ రేసులో కోట్ల ఖర్చు
ఎన్నడూ లేని సైలెన్స్...అందరికీ టెన్షన్


