నెహ్రూసెంటర్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురావడంతో వారి ఆర్తనాదాలతో ఆస్పత్రి మార్మోగింది. చేతులు, కాళ్లు, మెడ, తల ఇలా.. శరీరమంతా గాయాలతో వచ్చిన ప్రమా ద బాధితులతో ఆస్పత్రిలో ఎక్కడ చూసినా రక్తం కనిపించింది. బాధితుల్లో ఒకరు మృతి చెందగా మిగిలిన కూలీలు చికిత్స పొందుతున్నారు. బాధితులకు వైద్యం అందుతున్న విధానాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఆర్ఎంఓ డాక్టర్ జగదీశ్వర్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకట్ పర్యవేక్షించారు. కాగా, తీవ్రంగా గాయపడిన గూడెల్లి మంగమ్మ, దర్మారపు సాలమ్మ, దర్మారపు యాకమ్మను వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్పార్టీ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ గుగ్గిళ్ల పీరయ్య, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుడ్డెల రాంమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వీరయ్య, గణేష్, తదితరులు గాయపడినవారిని పరామర్శించారు.