జగిత్యాలరూరల్: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. శుక్రవారం సారంగాపూర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన ఏర్పాట్లు, నిల్వ ఉన్న సరుకులను పరిశీలించారు. విద్యాబోధన, భోజన వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చదువుపై ఆసక్తి పెంచుకుని ఉన్నత శిఖరాలను అధి రోహించాలని, వారి భవిష్యత్కు సంబంధించి పలు సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి మహ్మద్ సలీం, పంచాయతీ కార్యదర్శి ప్రేమలత, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జెడ్పీ పాఠశాల తనిఖీ
రాయికల్: రాయికల్ మండలం రామాజీపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం జెడ్పీ సీఈవో గౌతమ్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం భోజనం వండాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో చిరంజీవి, సర్పంచ్ బెజ్జంకి మోహన్ పాల్గొన్నారు.
‘బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్న సీఎం’
రాయికల్: సీఎం రేవంత్రెడ్డి ప్రతీ గ్రామంలో బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి అన్నారు. శుక్రవారం రాయికల్ పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ వైన్స్షాపుల్లో గౌడ కులస్తులకు 10శాతం రిజర్వేషన్లు కల్పించారని, ఈ ప్రభుత్వం బెల్టుషాపులను ప్రోత్సహిస్తుందన్నారు. కల్తీమద్యం వల్ల ప్రజల ఆరోగ్యం పాడైపోతుందని వాపోయారు. ఆయన వెంట మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, మున్సిపల్ చైర్మన్ కట్కం రవి, వైస్ చైర్మన్ తురగ సౌజన్య, కౌన్సిలర్ మహేశ్వరి, లతిక, రాకేశ్నాయక్, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఎస్సారెస్పీకి 2,398 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు శుక్రవారం సాయంత్రం వరకు 2398 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు నీటి మట్టం 1080.60 అడుగులు కాగా, నీటి నిల్వ సామర్థ్యం 46.654 క్యూసెక్కులకు చేరింది. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఇంటర్వ్యూలకు ఆహ్వానం
జగిత్యాల: జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 22న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన అధికారి సత్తమ్మ తెలిపారు. హైదరాబాద్లోని ఫాక్స్కాన్ కంపెనీలో ఖాళీల కోసం నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు ఆసక్తి గల వారు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే జాబ్మేళాకు హాజరు కావాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఎంపీహెచ్డబ్ల్యూ పోస్ట్కు..
జిల్లాలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎంపీహెచ్డబ్ల్యూ అతిథి అధ్యాపక పోస్ట్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ నోడల్ అధికారి రమేశ్బాబు తెలిపారు. బీఎస్సీ నర్సింగ్లో 50 శాతం మార్కులు కలిగి ఉండి, ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 24లోపు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.


