కామారెడ్డి డిక్లరేషన్పై రాహుల్ స్పందించాలి కమీషన్ల కోసమే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి
జగిత్యాలటౌన్: రాష్ట్రంలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పాలన సాగిస్తున్న రేవంత్రెడ్డి సామాజిక న్యాయంపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని మాజీమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి విమర్శించారు. జగిత్యాలలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఎనుముల రేవంత్ రెడ్డి చైర్మన్గా సాగుతున్న ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఆయన సోదరులు తిరుపతి రెడ్డి, భూపాల్ రెడ్డి, కొండల్ రెడ్డి, జగదీష్ రెడ్డి, కృష్ణారెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారని, వారి కనుసన్నల్లో హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని కోట్ల విలువైన భూములు కబ్జాకు గురవుతున్నాయని విమర్శించారు. 33 నెలల్లో ఒక కొత్త రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయని రేవంత్ రెడ్డి రూ.20 వేల కోట్ల కాంట్రాక్టు, తద్వారా లభించే కమీషన్ల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. అన్ని ప్రాంతాల విద్యార్థులకు విద్య అందించాలనే ఉద్దేశంతో కేసిఆర్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తే అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి ఇతర ప్రాంతాల పాఠశాలలు తరలించి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రాంతాల వారీగా విద్యను వికేంద్రీకరిస్తే రేవంత్ రెడ్డి ఇప్పటికే నడుస్తున్న పాఠశాలకు రంగు పూసి, తెలంగాణ మోడల్ స్కూల్స్ అంటున్నారని విమర్శించారు. కేసీఆర్ కుల వృత్తులను ప్రోత్సహించేందుకు కుటుంబం యూనిట్గా గొర్రెలు అందిస్తే.. రేవంత్ రెడ్డి ఆ పథకాన్ని కనుమరుగు చేసి గొల్ల కురుమల నోట్లో మట్టి కొట్టారని అన్నా రు. గీత కార్మికులకు చెట్టు పన్ను రద్దు చేసి మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత కేసీఆర్దే అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కుల వృత్తులను ప్రోత్సహించడంతో పాటు, విద్యకు ప్రాధాన్యత ఇస్తూ 652 గురుకులా లు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. గురుకులాలు తరలిస్తే సహించేది లేదని, వాటికి నూతన భవనా లు నిర్మించి యధావిధిగా కొనసాగించాలని డి మాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొస్తే బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న కామారెడ్డి డిక్లరేషన్ ఏమైందని నిలదీశారు. దీనిపై రాహుల్ గాంధీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఆయన వెంట అయిల్నేని వెంకటేశ్వర రావు, జున్ను రాజేందర్, , గాజుల రాజేందర్, కళ్లేపల్లి దుర్గయ్య, నేహాల్, ధర రమేష్, అబ్దుల్ బారి, గుండ మధు, నక్క జీవన్, ఆనంద్ రావు పాల్గొన్నారు.


