జగిత్యాలజోన్: జిల్లా కోర్టులో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా మొదటి అదనపు జడ్జి జి.సునీత, సబ్ జడ్జి నాగేశ్వర్రావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, న్యాయవాదులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు స్మరించుకోవాలి
జగిత్యాల: స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్, కలెక్టర్ క్యాంప్ కార్యాలయం, జెడ్పీ కార్యాలయాల్లో కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్య్రం సాధించడం వెనుక ఎందరో సమరయోధుల త్యాగాలున్నాయని, నాటి ఫలితమే నేడు అనుభవిస్తున్న స్వేచ్ఛ అన్నారు. వారి సేవలను, త్యాగాలను ప్రతి ఒక్కరు ఎళ్లప్పుడు స్మరించుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, లత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
భక్తులతో కిటకిటలాడిన నృసింహాలయం
ధర్మపురి: శ్రావణమాసం, వారాంతం కావడంతో శనివారం ధర్మపురిలో భక్తుల రద్దీ పెరిగింది. ముందుగా గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. శ్రీలక్ష్మీనృసింహాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు.
జాతీయ పతాకం ఎగురవేయలేదని ఎంపీడీవోకు ఫిర్యాదు
కొడిమ్యాల: మండలకేంద్రంలో గత పాలకవర్గం ఆధ్వర్యంలో 42ఫీట్ల ఎత్తైన జాతీయజెండా స్తంభాన్ని అంగడిబజార్లోని గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేశారు. అక్కడ ఏటా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం ఎగరవేయలేదంటూ గ్రామానికి చెందిన కొత్తూరి మహేశ్ ఎంపీడీవోకు శనివారం ఫిర్యాదు చేశాడు. ఈ జెండా వద్దనే నిత్య జనగణమన ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఉంటుందని, మండలంలోనే అతిపెద్ద జెండా అయినప్పటికీ పతాకాన్ని ఆవిష్కరించకపోవడం సరికాదని పేర్కొన్నాడు. 365 రోజులు జాతీయ పతాకం ఎగిరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరాడు.


