రాయికల్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రతీ సో మవారం నిర్వహించే ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు వచ్చి తమ సమస్యలపై అధికారులకు దరఖాస్తు చేసేవారు. ప్రజలకు దూరభారం ఎక్కువ కావడంతో గుర్తించిన ప్రభుత్వం ఇక నుంచి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని 20 మండలాల్లో అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ఈనెల 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అధికారులు ప్రజావాణి నిర్వహించనున్నారు.
అధికారులకు ప్రత్యేక శిక్షణ
ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిష్కరించేలా ఎంపీడీవోలకు హైదరాబాద్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రజావాణి విధివిధానాలపై అవగాహన కల్పించారు. ఫిర్యాదుదారులకు సంబంధించిన ఐడీ, ఇతర వివరాలతో రశీదు ఇవ్వాలని, మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసే ఆపరేటర్లకు సమస్యలను ఎప్పటికప్పుడు పోర్టల్లో అప్డేట్ చే స్తూ సంబంధిత శాఖకు ఫార్వర్డ్ చేయాలని ఆదేశాలు రాగా, ఆపరేటర్లకు సైతం శిక్షణ ఇవ్వనున్నారు.
హాజరయ్యే అధికారులు వీరే..
ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణికి ఎంపీడీవో, తహసీల్దార్, ఎంపీవో, ఎంఈవో, మండల వ్యవసాయధికారి, హార్టికల్చర్ ఆఫీసర్, వెటర్నరి అసిస్టెంట్ సర్జన్, మత్స్య శాఖ అధికారి, మెడికల్ ఆఫీసర్, సీడీపీవో, సాంఘీక సంక్షేమాధికారి, గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమాధికారులు, డెప్యూటీ తహసీల్దార్, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఫారెస్ట్, మున్సిపల్ కమిషనర్, ఎస్సై, ఎకై ్సజ్ అధికారులు హాజరయ్యేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమయ పాలన పాటించని అధికారులపై చర్యలు చేపట్టనున్నారు.
తగ్గనున్న దూరభారం
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా వాణికి జిల్లాలోని మారుమూల మండలాల నుంచి ఫిర్యాదుదారులు రావాలంటే సుమారు 50 కి.మీ ప్రయాణించాలి. ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజా వాణి నిర్వహిస్తే ఫిర్యాదుదారులకు దూరభారం తగ్గి, సమయం వృథా కాకుండా ఉంటుంది.


