జగిత్యాలక్రైం: పంద్రాగస్టు వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా భద్రత చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లోని రద్దీ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్స్టాండ్లు, మార్కెట్ ఆవరణల్లో జాగిలాలతో పోలీసులు బృందాలతో తనిఖీలు చేపట్టామన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు, అనుమానాస్పద వాహనాలు, బ్యాగులు, పార్సిళ్లు, ఇతర వస్తువులు కనిపిస్తే సమాచారం అందించాలని సూచించారు. తనిఖీల్లో బాంబ్ డిస్పోజల్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.
బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
పోలీస్సేవలను ప్రజలకు మరింత వేగంగా.. సమర్థవంతంగా అందించేందుకు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ఎస్పీ కార్యాలయంలో బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బందితో సమావేశమయ్యారు. హాట్స్పాట్ల వద్ద అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద వాహనాలు, కదలికలను నిశితంగా పరిశీలించాలన్నారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిఘా పెంచాలన్నారు. డయల్ 112 కాల్ వస్తే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు తక్షణ సహాయం అందించాలని సూచించారు. డీసీఆర్బీ డీఎస్పీ రవి కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా తన కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షలో పాల్గొన్నా రు. ప్రతిభ కనబర్చిన పోలీసుల అధికారులను సన్మానించారు. అదనపు ఎస్పీ చేతన్ నితిన్ ఐపీఎస్, డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, రాములు, రవికుమార్, సీఐలు ఆరిఫ్ అలీఖాన్, శ్రీనివాస్, కరుణాకర్, రాజ్కుమార్, రిజర్వ్ సీఐలు పాల్గొన్నారు.


