● రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల్లేక ఇక్కట్లు
● ప్రభుత్వ తీరుపై సర్చంచుల ఆగ్రహం
● జిల్లావ్యాప్తంగా రూ.62,40,36,827 బకాయిలు
పెగడపల్లి: విద్యుత్ బిల్లుల భారం గ్రామ పంచాయతీలపై గుదిబండగా మారిందని సర్పంచులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలోని 385 గ్రామ పంచాయతీలు 2026 జూన్ వరకు విద్యుత్ శాఖకు రూ.62,40,36,827 బకాయి పడ్డాయి. బిల్లుల చెల్లింపుల కోసం 15వ ఆర్థిక సంఘం నిధులు మళ్లించాలని వచ్చిన ప్రభుత్వ ఆదేశాలు పంచాయతీల్లో ఇతర అభివృద్ధి పనులకు ఆటంకంగా మారాయి. అసలే నిధుల లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పంచాయతీలకు బకాయిలతో కొత్త సమస్య ఏర్పడిందని సర్పంచులు చెబుతున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ విద్యుత్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులకు వినియోగించాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులతోపాటు విద్యుత్ బిల్లుల చెల్లింపులకు అవసరమైన మొత్తాన్ని కేటాయించకపోవడంతో పంచాయతీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులో కూరుకుపోయాయి. ఇప్పటికే తాగునీటి సరఫరా, మంచినీటి పథకాల మరమ్మతు, వీధిదీపాల బిల్లులు చెల్లించేందుకే పంచాయతీల ఖాతాల్లో చిల్లిగవ్వ లేక సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ బిల్లులను 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించాలని ప్రభుత్వం సూత్రపాయంగా ఇటీవల ఆదేశాలు జారీ చేయడంతో సర్పంచులు, కార్యదర్శులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు విద్యుత్శాఖ అధికారులు జీపీలకు నోటీసులు ఇవ్వడంతో నిధులను మళ్లించక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో డెంగీ, మలేరియా, వైరల్జ్వరాల నివారణకు ఫాగింగ్, డ్రైనేజీల శుభ్రత, చెత్తతొలగింపు అత్యంత కీలకం. ఇటువంటి సమయంలో అందుబాటులో ఉన్న నిధులన్నీ విద్యుత్ బిల్లలకే కేటాయిస్తే ప్రజారోగ్యం ఆగమ్యగోచరంగా మారుతుందని సర్పంచులు, కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో మండలాల వారీగా పేరుకుపోయిన బకాయిలు
మండలం బకాయిలు
బీర్పూర్ 65,06,527
బుగ్గారం 1,45,54,465
ధర్మపురి 1,94,42,223
గొల్లపల్లి 3,57,25,252
ఇబ్రహీంపట్నం 1,47,01,957
జగిత్యాల రూరల్ 5,38,82,992
జగిత్యాల అర్బన్ 97,80,149
కథలాపూర్ 3,61,71,797
కొడిమ్యాల 6,07,79,439
కోరుట్ల 2,36,89,751
మల్లాపూర్ 3,01,23,162
మల్యాల 4,45,56,055
మేడిపల్లి 5,87,55,457
మెట్పల్లి అర్బన్ 1,92,144
మెట్పల్లి రూరల్ 4,56,99,366
పెగడపల్లి 5,78,07,390
రాయికల్ 4,83,49,096
సారంగాపూర్ 2,47,14,683
వెల్గటూర్ 3,85,67,413
మొత్తం 62,40,36,827


