జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు 41.907 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి కేవలం 3,217 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. ప్రస్తుతం నీటిమట్టం 1078.80 అడుగులు, 41.907 టీఎంసీలుగా ఉంది.
పేద కుటుంబానికి ఇల్లు నిర్మించిన ఎన్నారై దంపతులు
జగిత్యాలజోన్: కూలీ పనిచేసుకుంటూ.. ఇద్దరు పిల్లలతో ఓ పూరిగుడిసెలో నివసిస్తున్న మహిళకు ఆస్ట్రేలియాలో ఉంటున్న ఎన్నారై దంపతులు రూ.2.60లక్షలతో ఇల్లు నిర్మించి ఇచ్చారు. ఆ ఇంటిని ఆదివారం ప్రారంభించి పేద కుటుంబానికి అప్పగించారు. బీర్పూర్ మండలకేంద్రానికి చెందిన జమున భర్త కొ న్నాళ్ల క్రితం మరణించారు. జమున కూలీ పని చేస్తూ ఇద్దరు పిల్లలతో కలిసి ఓ పూరి గుడిసెలో ఉంటోంది. విషయం తెలుసుకున్న జిల్లాకేంద్రానికి చెందిన సామాజిక సేవకుడు సామ ఉమాపతి ఆస్టేలియాలో ఉంటున్న ఎన్నారై దంపతులు కోటగిరి రంజిత్, రాధికకు వివరించారు. దీనికి వారు అంగీకరించి రూ.2.60 లక్షలు పంపించారు. ఆ డబ్బులతో ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ దగ్గరుండి ఇంటి నిర్మాణం పూర్తి చేయించాడు. రంజిత్ తల్లిదండ్రులు కోటగిరి శ్రవణ్, కళ ఆ ఇంటిని ప్రారంభించి, జమునకు అప్పగించారు. కార్యక్రమంలో సర్పంచ్ హరీశ్, ఉప సర్పంచ్ జితేందర్, లక్ష్మీనరసింహాస్వామి చైర్మన్ శ్రీనివాస్, డైరెక్టర్లు సత్యనారాయణ, రమేశ్, సామాజిక సేవకులు గర్షకుర్తి రమేశ్, ఆడెపు వెంకటేష్, గంగాధర్, బాపురెడ్డి పాల్గొన్నారు.
యథేచ్ఛగా రేషన్ బియ్యం తరలింపు
మల్యాల: మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తుండడంతో కొంతమంది దళారులు డీలర్ల వద్దకే వెళ్లి వినియోగదారుల నుంచి కిలోకు రూ.14 నుంచి రూ.16కు కొనుగోలు చేస్తున్నారు. మరికొంతమంది వినియోగదారులు ఇంటికి తీసుకెళ్లి కిలో రూ.18 నుంచి రూ.20కి విక్రయిన్నారు. అయితే దళారులు ద్విచక్ర వాహనాలపై ఇంటింటికి తిరిగి బియ్యం కొనుగోలు చేసి బహిరంగంగా తరలిస్తుండడం విస్మయానికి గురి చేస్తోంది. రేషన్ దుకాణాలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బియ్యం అక్రమార్గాన తరలిపోతున్నాయి. డీటర్లపై నిఘా పెంచడంతోపాటు బియ్యం తరలిపోకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


