కోరుట్లరూరల్: మండలంలోని అయిలాపూర్ హామ్లేట్ గ్రామం కిషన్రావుపల్లె శివారులోని మారెమ్మతల్లి ఆలయ స్థలం వివాదాస్పదంగా మారింది. గ్రామ శివారులో ఓ వ్యక్తికి సంబంధించి 72 ఎకరాల స్థలం ఉండగా, కొన్నేళ్ల క్రితం అందులో నుంచి 25 ఎకరాలు కిషన్రావుపల్లె వాసులు, 12 ఎకరాలు అయిలాపూర్ గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేశారు. గీత కార్మికులు 12 ఎకరాల నుంచి 9 ఎకరాలు ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి విక్రయించారు. రియల్టర్ ఆ స్థలాన్ని చదును చేసే పని ప్రారంభించగా, అందులో మారెమ్మతల్లి ఆలయం ఉందని, జేసీబీతో తొలగించారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కూల్చిన ఆలయాన్ని పునర్నిర్మించాలని మారెమ్మతల్లి ఫ్లెక్సీ, జెండాలు పెట్టి ఆందోళన చేపట్టారు. కాగా, ఆ స్థలంలో ఏ ఆలయం లేదని గ్రామస్తులు కావాలని వివాదం సృష్టిస్తున్నారని గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ లక్ష్మీనారాయణ, రెవెన్యూ అధికారులు వివాదాస్పద స్థలాన్ని పరిశీలించి గ్రామస్తులు, గీతకార్మికులతో మాట్లాడారు. ఇరు వర్గాలు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సముదాయించారు. కాగా పునర్నిర్మించే వరకు ఆందోళన కొనసాగిస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు.


