జగిత్యాలరూరల్: రైతులకు విద్యుత్ సరఫరా, ఎరువుల పంపిణీలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. శుక్రవారం సారంగపూర్ మండల కేంద్రంలో మాట్లాడారు. ఎల్నినో ప్రభావం గురించి వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని ఎగువకు తరలిస్తే కేసీఆర్కు పేరు వస్తుందని కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. అల్పపీడన ప్రభావంతో రైతుల్లో కొంచెం ఆశలు చిగురించాయని, పూర్తిస్థాయిలో సాగు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 గంటల విద్యుత్ ఇచ్చారని, ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి పరిస్థితి మళ్లీ పునరావృతం అయిందన్నారు. శ్రీశైలం జలాశయంలో 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పిత్తి చేసే అవకాశం ఉండేదని, ఇప్పుడు కేవలం 100 మెగావాట్ల ఉత్పత్తి చేస్తున్నారని, ఇంకా 800 మెగావాట్ల ఉత్పాదన చేయకపోవడంతో రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడుతుందన్నారు. 800 మెగావాట్లు ఉత్పత్తి చేస్తే పోతిరెడ్డిపాడుకు నీళ్లు వెళ్లవని, ఇది మొత్తం చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తుందని ఆరోపించారు. సత్యం రావు, తేలు రాజు, రాంచంద్రారెడ్డి, గంగన్న, యశ్వంత్, పూర్ణచందర్రెడ్డి, మధు పాల్గొన్నారు.


