జిల్లాలో 13 నుండి ప్రారంభం
గొల్లపల్లి: కేంద్ర ప్రభుత్వం ఎరువుల పంపిణీ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు కేవలం యూరియాను మాత్రమే యాప్ ద్వారా పంపిణీ చేస్తుండగా.. ఇక నుంచి అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులకూ వర్తింపజేయడానికి కేంద్రం కొత్త యాప్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ను తీసుకువస్తోంది. ఎరువుల కొరత, బ్లాక్ మార్కెటింగ్ అరికట్టడంతోపాటు రైతులు క్యూలో నిలబడే ఇబ్బందులను తప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎరువుల కొనుగోళ్లకు డిజిటల్ విధానంలో ఎరువులను ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు కొత్త యాప్ రైతుల ముందుకు తేనుంది. ఇప్పటివరకు యూరియా బుకింగ్ కోసం వినియోగిస్తున్న ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్’ స్థానంలో ప్రైమరీ ఫెర్టిలైజర్ సేల్ (ఎఫ్ఎఫ్ఎస్) పేరుతో తీసుకొస్తున్నారు. దీని ద్వారా యూరియాతో పాటుగా రైతుకు అవసరమైన డీఏపీ, పొటాష్ వంటి కాంప్లెక్స్ ఎరువులన్నీ బుకింగ్ చేసుకుని కొనుగోలు చేసేలా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అవకాశం కల్పిస్తున్నది. ఒక కేంద్రంలో అన్ని రకాల ఎరువులు అందుబాటులో లేకపోతే వేర్వేరు ఎరువులకు వేర్వేరు డీలర్లను ఎంపిక చేసుకునే సౌకర్యాన్ని కూడా యాప్లో కల్పించారు. కొత్త యాప్ ద్వారా ఎరువులు పొందాలంటే ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్కు లింక్ అయిన ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. లేకుంటే ఎరువులు బుక్ చేసుకునే అవకాశం ఉండదు. అయితే క్షేత్రస్థాయిలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూమి ధ్రువీకరణతో..
ఎరువుల కొనుగోలు సులభం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న యాప్ను స్మార్ట్ఫోన్ కలిగిన ప్రతిఒక్కరూ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆపై భూమి విస్తీర్ణాన్ని ధ్రువీకరించుకుని రైతు ఆధార్ నంబర్గానీ, రైతు రిజిస్ట్రేషన్ నంబర్ గానీ నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత రైతుకున్న భూమి సర్వే నంబర్ల వారీగా కనిపిస్తుంది. ఆయా సర్వే నంబర్లలో ఏయే పంట సాగు చేశారో నమోదు చేయాలి. ఎరువు, పరిమాణం నమోదు చేయాలి. తనకు అవసరం ఉన్న ఎరువు ఏ రిటైలర్ షాపులో ఉన్నదో ఎంచుకోవాలి. రైతు స్వయంగానా లేదా మరొకరి కోసమా ధ్రువీకరించాలి. సంప్రదింపుల కోసం ఫోన్ నంబర్ను నమోదు చేయాలి. అప్పుడు క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ను తీసుకుని ఎంచుకున్న రిటైలర్ వద్దకు వెళ్లి ఎరువులు తీసుకోవాల్సి ఉంటుంది.
యాప్ వినియోగంపై శిక్షణ కొనసాగుతోంది. కొన్ని జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అక్కడ వస్తున్న సమస్యలకు అనుగుణంగా మార్పులు చేర్పులు ఉంటాయి. రైతులు ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎరువుల దుర్విని యోగం జరగకుండా కేవలం వ్యవసాయ రంగాని కి మాత్రమే అందించేందుకు ప్రభుత్వం యాప్ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈనెల 13 నుండి మన జిల్లాలో ప్రారంభమవుతుంది.
– భాస్కర్, డీఏవో


