‘యావర్' చుట్టూ రాజకీయం
విస్తరిస్తేనే రాజకీయాల్లో ఉంటానన్న ఎమ్మెల్యే సంజయ్ 100 ఫీట్లకు విస్తరణ అంశం సీఎం దృష్టికి.. ఆక్రమణలు తొలగించాలని కలెక్టర్కు మాజీమంత్రి లేఖ జిల్లాకేంద్రంలో పెరుగుతున్న జనాభా అయినా.. పురాతన కాలం నాటి రోడ్లే దిక్కు
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని యావర్రోడ్ ఎన్హెచ్–63ను కొత్తబస్టాండ్ నుంచి ధర్మపురి రోడ్ వరకు తాకుతుంది. ఇది జిల్లాకేంద్రంలోనే ప్రధానమైన వాణిజ్య వ్యాపారాలు గల రోడ్డు. దీనిని విస్తరించాలని గతంలో చాలాసార్లు ప్రయత్నించినప్పటికీ అక్కడున్న వ్యాపారులు కోర్టులకు వెళ్లడం, ఇతరత్రా కారణాలతో నిలిచిపోయింది. జిల్లాకేంద్రం కావడం.. వాణిజ్య కేంద్రాలు పెరిగిపోవడంతో రోడ్డంతా ఇరుకుగా మారింది. ప్రస్తుతం 80 ఫీట్లుగా ఉన్న ఈ దారిని 100ఫీట్లకు విస్తరిస్తే తప్ప ఇబ్బందులు తప్పేలా లేవు. రోడ్డు ఇరుకుగా మారడంతో ప్రయాణికులు వెళ్లాలంటేనే జంకుతున్నారు. పైగా ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.
మున్సిపాలిటీగా ఏర్పడిననాటి నుంచి..
జగిత్యాల మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి ఉన్న రోడ్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. జగిత్యాలకు ప్రధానమైంది యావర్రోడ్డు. జిల్లాకేంద్రం కావడం, లక్షకు పైగా జనాభా ఉండడం.. నిత్యం వివిధ పనుల నిమిత్తం వందలాది మంది జిల్లాకేంద్రానికి వస్తుంటారు. ఉద్యోగాలు, చదువుల నిమిత్తం వేలాది మంది ఉపాధి పొందుతూ ఇక్కడే ఉంటున్నారు. దీంతో ట్రాఫిక్ అత్యధికంగా పెరిగిపోయింది. ఐదేళ్లకోసారి ప్రజాప్రతినిధులు మారుతున్నా జగిత్యాల రూపురేఖలైతే మారడం లేదు. డివిజన్ కేంద్రంగా ఉన్నప్పుడు ఈ యావర్రోడ్ ఇరుకుగా ఉండటంతో గతంలో బైపాస్రోడ్ను నిర్మించారు. బైపాస్రోడ్ కూడా పూర్తిగా ట్రాఫిక్గా మారిపోయింది. అత్యధిక స్కూళ్లు, హోటల్స్, వాణిజ్య వ్యాపారాలు ఆ రోడ్డుపై వెలవడంతో అవి ట్రాఫిక్ సమస్యగానే మారింది.
విస్తరణ జరిగేనా..?
జిల్లాలో అతిపెద్ద సమస్య అయిన యావర్రోడ్డు విస్తరణకు ఎమ్మెల్యే సంజయ్కుమార్ కోసం కృషి చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న చోట 100 ఫీట్ల రోడ్లు చేపట్టారు. మిగతావి కేసులు ఉండటంతో అలాగే ఉండిపోయాయి.
ఆక్రమణలు
యావర్రోడ్డు 80 ఫీట్లు ఉన్నా.. వ్యాపారులు రోడ్డు ను ఆక్రమించుకున్నారు. ఎలాంటి సెట్బ్యాక్ పా టించకుండా వ్యాపారాలు నిర్వహించడంతో ప్రజల రాకపోకలకూ కష్టంగా మారుతోంది. కనీసం వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. యావర్రోడ్డులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఇటీవల మాజీమంత్రి జీవన్రెడ్డి కలెక్టర్కు వినతిపత్రం అందించారు.
బైపాస్ అంటేనే భయం
జిల్లా కేంద్రం కాకముందు ప్రజల వెసులుబాటు కోసం బైపాస్రోడ్ వేశారు. ఆ సమయంలోనే బైపాస్ను 100 ఫీట్లు వేస్తే బాగుండేది. ఆ రోడ్డు ఇప్పుడు ఇరుకుగా మారడం.. జనాభా, ట్రాఫిక్ పెరిగిపోవడం సమస్యగా మారింది.
ఇరుకు రోడ్లే..
జిల్లా కేంద్రంలో ప్రదానమైన రోడ్లన్నీ ఇరుకుగానే ఉన్నాయి. 1983లోనే ఉన్న మాస్టర్ ప్లానే అమలు కావడంతో రోడ్లు అభివృద్ధి కావడం లేదు. మా స్టర్ ప్లాన్ అమలు కాకపోవడం, రోడ్లు విస్తరణ కాకపోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రతరంగా మా రింది. కనీసం వాహనాలు పార్కింగ్ చేద్దామన్నా స్థలాలు లేని పరిస్థితి. ముఖ్యంగా తహసీల్ చౌరస్తా నుంచి టవర్ నుంచి కొత్తబస్టాండ్, గంజ్ కనీసం ఆటో సై తం వెళ్లలేని పరిస్థితి ఉంది. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి జనాభా పెరిగిపోతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ యావర్రోడ్తో పాటు, బైపాస్రోడ్ల విస్తరణ చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
సీఎం దృష్టికి రోడ్డు విస్తరణ
యా
వర్రోడ్డును విస్తరించాలని, ఇందుకు నిధులు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే సంజయకుమార్ సీఎం రేవంత్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. రోడ్డు విస్తరిస్తేనే తాను రాజకీయాల్లో కొనసాగుతాయని కూడా ప్రకటించారు. దీనిపై మాజీమంత్రి జీవన్రెడ్డి స్పందించారు. పదేళ్లుగా ఏం చేశారని, ఇప్పుడు రహదారి విస్తరిస్తేనే రాజకీయాల్లో ఉంటానని చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. మొత్తంగా జిల్లా రాజకీయం మొత్తం ఈ యావర్ రోడ్డు చుట్టే తిరుగుతోంది.
‘యావర్' చుట్టూ రాజకీయం


