నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
జగిత్యాల: నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు అందిస్తోందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కొడిమ్యాల మండలకేంద్రంలోని అక్షయ గార్డెన్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి పంపిణీ చేశారు. మండలంలో 437 ఇళ్లు మంజూరు కాగా.. 436 మందికి మంజూరు పత్రాలను అందించామన్నారు. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, హౌసింగ్ ప్రత్యేక అధికారి, మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, హౌసింగ్ పీడీ ప్రసాద్ పాల్గొన్నారు.
రాజీవ్ యువ వికాసం పకడ్బందీగా అమలు
రాజీవ్ యువ వికాసం పథకం పకడ్బందీగా అమలు చేస్తున్నామని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. యూనిట్ల గ్రౌండింగ్కు సంబంధించి డెప్యూటీ సీఎం విక్రమార్క కలెక్టర్లతో సమీక్షించారు. జిల్లా సమాచారాన్ని కలెక్టర్ ఆయనకు వివరించారు.
గ్రామీణుల కోసమే పల్లె దవాఖానాలు
ఇబ్రహీంపట్నం: గ్రామీణులకు వైద్య సేవలు అందించేందుకే పల్లె దవాఖానాలు ప్రారంభిస్తున్నట్లు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మండలంలోని తిమ్మాపూర్, వర్షకొండ గ్రామాల్లో దవాఖానాల ఏర్పాటుకు జాతీయ వైద్య ఆరోగ్య శాఖ నిధులు రూ.20లక్షల చొప్పున మంజురయ్యాయన్నారు. పట్టణాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోలేని పేదల కోసం కేసీఆర్ ప్రభుత్వంలో పల్లె దవాఖానాలను నిర్మించిందని గుర్తు చేశారు. ఇందులో అన్ని రకాల రక్త పరీక్షలు చేస్తారని, మందులు ఉచితంగా ఇస్తారని, ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. తాను ఎంబీబీఎస్ చదివినప్పుడు కేవలం రెండు మెడికల్ కాలేజీలే ఉండేవని, కేసీఆర్ సీఎం అయ్యాక జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటైందన్నారు. డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, డిప్యూటీ వైద్యాధికారి శ్రీనివాస్, వైద్యాధికారి అనిల్కుమార్, ఎంఎల్హెచ్పీ మాధవి, పంచాయతీ రాజ్ డీఈ శ్రీనివాస్, ఏఈ అభినవ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అఖిల్, మాజీ వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
అవ్వా నిన్ను ఆదుకుంటా
‘అవ్వా.. నిన్ను ఆదుకుంటా.. ఏడ్వకు, వృద్ధాశ్రమానికి పంపిస్తా..’ అని ఎమ్మెల్యే ఓ వృద్ధురాలిని ఓదార్చారు. తిమ్మాపూర్లో పల్లె దవఖానా ప్రారంభించి వస్తుండగా రోడ్డు పక్కన చిన్న గుడిసెలో ఉంటున్న అనాథ వృద్ధురాలు చిన్నంశెట్టి లచ్చవ్వ వద్దకు వెళ్లారు. ఆమెను ఏదైనా ఆశ్రమంలో చేర్పించాలని కొందరు మహిళలు ఆయనకు వివరించడంతో చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ నరేష్కు ఫోన్ చేసి వృద్ధురాలిని ఆశ్రమంలో చేర్పించాలని సూచించారు.
రోళ్లవాగు పనులు ప్రారంభం
సారంగాపూర్: రోళ్లవాగు ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. కట్టపై 1275 మీటర్ల పొడవుతో గోడ నిర్మాణ పనులు చేపడుతున్నారు. బీర్పూర్ శివారులో రూ.136.81 కోట్లతో 2015 – 16లో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు 85 శాతం పూర్తయ్యాయి. నిధుల లేమితో ఏడాదికాలంగా పనులు ముందుకు సాగలేదు. మరోవైపు అటవీశాఖ అనుమతులు కూడా ఆలస్యం కావడంతో ప్రాజెక్టు వ్యయం పెరిగింది. ఇటీవల ప్రభుత్వం రూ.17 కోట్లు కేటాయించడంతో పనులు ప్రారంభించారు. ప్రాజెక్టు పూర్తయితే బీర్పూర్, ధర్మపురి మండలాల్లోని 15 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇంకా మూడు స్లూయిస్కు గేట్లు బిగించాల్సి ఉంది. జూన్లో గేట్లు బిగించనున్నట్లు డీఈ చక్రూనాయక్ తెలిపారు.
నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు


