జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాలోని విట్స్ యూనివర్సిటీలో సోషియాలజీ హెడ్గా ఉన్న భారతీయ ప్రొఫెసర్ ‘జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై శుక్రవారం పదవికి రాజీనామా చేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ప్రొఫెసర్ శ్రీలా రాయ్ను సస్పెండ్ చేసేందుకు వర్సిటీ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
దేశంలోని వర్సిటీల్లో విదేశీయులు ఎక్కువ మంది ఉండటంపై జరుగుతున్న చర్చ సందర్భంగా ఫిబ్రవరి 21వ తేదీన సోషల్ మీడియాలో ప్రొఫెసర్ శ్రీలా రాయ్..‘దక్షిణాఫ్రికా వాసులకు పోటీ తత్వం, పనిపై శ్రద్ధ తక్కువ, ఉదాసీనత ఎక్కువ’అంటూ వ్యాఖ్యానించారు.
దీనిపై తీవ్ర దుమారం రేగడంతో ఆమె క్షమాపణ చెప్పడంతోపాటు ఆ పోస్టును తొలగించారు. వివాదం ముదరడంతో శుక్రవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఇటువంటి వ్యాఖ్యలకు దేశంలో చోటులేదంటూ యూనివర్సిటీ పోర్టుఫోలియో కమిటీ చైర్మన్ టెబొగ లెట్సీ తెలిపారు. ఆమెపై సస్పెన్షన్ సహా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.


